రేపటి నుండే అమరనాథ్ యాత్ర ప్రారంభం… స్పాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్ యాత్రకి సంబంధించిన స్పాట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకు జమ్మూలోని పురానీ మండి వద్ద వున్న రామమందిరం కాంప్లెక్స్లో అధికారులు ఓ కేంద్రాన్ని ప్రారంభించారు. ఒక్క రోజులో 600 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిన్న ఒక్క రోజే 358 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దాదాపు 1600 మంది యాత్రికులు బేస్ క్యాంపు అయిన భాగవతి నగర్కి చేరుకున్నారు. వారిలో మహిళలు సహా 800 మంది సాధువులు కూడా వున్నారు. సరస్వతీ ధామ్కి తెల్లవారు జామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకొని, క్యూలైన్లలో నిల్చున్నారు. అయితే బంగ్లాదేశ్ నుంచి సైతం నలుగురు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకొని, జమ్మూకి చేరుకున్నారు. ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు భద్రతా రీత్యా కూడా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. డ్రోన్లు, 365 డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాల సాయంతో వాహనాల రాకపోకలను కూడా గమనిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై సెక్యూరిటీ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు.