భారత్ ధర్మసత్రం కాదు : అమిత్ షా

అక్రమ వలసదారులు, దేశ భద్రతకు విఘాతం కలిగించే వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత దేశం ధర్మసత్రమేమీకాదని, దేశ భద్రతకు ముప్పు తలపెట్టే వారిని భారత్ లో అడుగు పెట్టనివ్వమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు.
వలసలు, విదేశీయులు(ఇమ్మిగ్రేషన్స్‌ అండ్‌ ఫారినర్స్‌) 2025 బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. బిల్లులోని పలు అంశాలు ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అపరిమిత అధికారాన్ని ఇస్తున్నాయని, ఆయా అంశాలపై జేపీసీతో అధ్యయనం చేయించాలని విపక్ష సభ్యులు చేసిన డిమాండ్లు ఫలించకపోగా.. మూజువాణీ పద్ధతిలో బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మూడు గంటలకు పైగా సాగిన చర్చలో.. వలసలు, విదేశీయులు బిల్లు ఆవశ్యకతను వివరిస్తూ అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. వలసలు, విదేశీయుల 2025 బిల్లు దేశ భద్రతను బలోపేతం చేస్తుందని, 2047 నాటికి భారత్‌ను అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడుతుందని తెలిపారు.
దేశ భద్రతకు ముప్పు తెచ్చే వారిని దేశంలో అడుగు పెట్టనివ్వమన్నారు. అయితే వ్యాపారం. విద్య, వైద్యం కోసం వచ్చే వారిని, పర్యాటకులను, దేశ ప్రగతికి సహకరించేవారిని మాత్రం స్వాగతిస్తామని ప్రకటించారు.
మరోవైపు బెంగాల్ లోని మమత బెనర్జీ ప్రభుత్వంపై కూడా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సరిహద్దు భద్రతా ప్రయత్నాలను అడ్డుకుంటున్నదని, అక్రమ వలసదారులకు సహాయం చేస్తున్నదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. సరిహద్దు ఫెన్సింగ్ ప్రయత్నాలకు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని అమిత్ షా విమర్శించారు, రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడానికి నిరాకరించడంతో 450 కి.మీ. ఫెన్సింగ్ పనులు అసంపూర్ణంగా ఉన్నాయని ఆయన తెలిపారు. “ఫెన్సింగ్ పనులు ప్రారంభమైనప్పుడల్లా, అధికార పార్టీ కార్యకర్తలు గూండాయిజం, మతపరమైన నినాదాల ద్వారా అంతరాయాలు సృష్టిస్తున్నారు” అని ఆయన ఆరోపించారు.
బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాలు ఇప్పుడు అస్సాం కాకుండా పశ్చిమ బెంగాల్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. “టిఎంసి ప్రభుత్వం చొరబాటుదారులపై దయ చూపుతోంది, వారికి ఆధార్, ఓటరు కార్డులు జారీ చేస్తోంది” అని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టుబడిన చాలా మంది అక్రమ వలసదారులకు 24 పరగణాల జిల్లా నుండి ఆధార్ కార్డులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
2026లో బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అటువంటి కార్యకలాపాలు నిలిపివేయబడతాయని ఆయన స్పష్టం చేశారు. బిల్లుపై చర్చకు షా సమాధానమిస్తూ, వలసలు జాతీయ భద్రతతో దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని, దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించే వారిని పర్యవేక్షించడం చాలా కీలకమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *