సమాజం పట్ల అంకితభావం ఆదర్శవంతమైన వ్యక్తిత్వం
సమాజానికి, దేశానికి తమ వంతుగా సహాయ, సహకారాలు అందించడమనేది వయసుతో సంబంధం లేదని మహారాష్ట్రలోని థానేలో నివసిస్తున్న సంఘ స్వయంసేవక్ రవి కర్వే నిరూపించారు. టి.జె.ఎస్.బి. కో-ఆపరేటివ్ బ్యాంక్ నుండి పదవీ విరమణ చేసిన తరువాత రవి కర్వే తన నలుగురు సహచరులతో కలిసి, గత 10 సంవత్సరాలలో మహారాష్ట్రలోని అనేక చిన్న గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని మురికివాడల నుండి సుమారు 2500 మంది పిల్లలకు విజయ గాథలు వ్రాయడానికి అవకాశం కల్పించడమేకాక వారికి సమాజం నుండి తీసుకోవడంతో పాటు సమాజానికి ఇవ్వడం కూడా నేర్పించారు. విద్యార్థి వికాస్ యోజన కింద 2010 నుంచి 2022 వరకు 2500 మందికి పైగా పిల్లలకు ఇంజినీరింగ్, మెడికల్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను రూ.10 కోట్ల 95 లక్షల దాతల సహకారంతో చెల్లించారు. రాయ్గఢ్, థానే జిల్లాల్లో 6 శిథిలమైన పాత పాఠశాల భవనాలను కూడా పునర్నిర్మించారు. రవి కార్వే, అతని బృందం ప్రతిభా వంతులైన పేద పిల్లలకు, సేవాభావం ఉన్న ధనిక కుటుంబాలకు మధ్య వారధిగా పనిచేశారు. డబ్బు లేని ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా వారు కృషి చేశారు.
విద్యార్థి వికాస్ యోజన ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అందులో ఘట్కోపర్ దగ్గర బస్తీలో నివసించే స్వాతి ఇల్లు వర్షాకాలంలో 3 నెలల పాటు చెరువుగానే ఉండేది. చదువులో ప్రతిభావంతురాలైన ఆమె పేదరికం చదువుకు ఇబ్బందిగా మారింది. విద్యార్థి వికాస్ యోజన ఆమెకు అండగా నిలిచి 12వ తరగతి తర్వాత బి.యస్ సి, ఆ తర్వాత ఎం.యస్.సి పూర్తి చేసి ప్రస్తుతం ఏడాదికి రూ.19 లక్షల ప్యాకేజీతో బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. అలాగే షోలాపూర్లో తన ఒంటరి తల్లి కష్టానికి, సంకల్పానికి సజీవ ఉదాహరణగా మారిన అంజలి లోఖండే చిన్న గుడిసెలో తన మెడల్స్, అవార్డు లను ఒక బుట్టలో దాచుకునేది. నేడు మెకానికల్ ఇంజినీరింగ్లో అగ్రస్థానంలో నిలిచి, పెద్ద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన తల్లితో కలిసి నాగపూర్లో నివసిస్తోంది. ఇదంతా విద్యార్థి వికాస్ యోజనలో చేరడం ద్వారా ఆమె ఇంజనీరింగ్ ఫీజును ఒక పెద్దాయన చెల్లించి నందున ఆమె దీన్ని చేయగలిగింది.
చిన్న చిన్న గ్రామాలు, పల్లెటూర్లు, మురికి వాడల నుంచి పెద్ద పెద్ద ఐటీ కంపెనీ, మెడికల్, ఇంజినీరింగ్ సెక్టార్లలో తమ గుర్తింపును నమోదు చేసుకున్న ఈ చిన్నారుల అద్భుత పరివర్తనకి ఆధారం ఏమిటి? పిల్లలను ఎలా ఎంపిక చేస్తారు? విద్యార్థి వికాస్ యోజన అంటే ఏమిటి ?
మొదటి నుండి ఈ పనిలో ఉన్న స్వయంసేవక్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ 2010లో మొదటగా ప్రతిభావంతులైనప్పటికీ, వారి కలలపై రాజీ పడుతున్న 5 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఆ విద్యార్థుల తల్లితండ్రులు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు కట్టలేకపోయారు. ఈ ఐదుగురు పిల్లల ఫీజులను కొందరు దాతలు చెల్లించారు. అది చూసి మరికొంతమంది దాతలు ముందుకు వచ్చారు. ఇలా మొదలైనది ఈ ప్రయాణం. 2017లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వారా నడుస్తున్న ‘‘సేవా సహయోగ్ సంస్థ’’ ఈ పనికి ఒక సంస్థాగత రూపం ఇవ్వడానికి ముందుకు వచ్చింది.
ఈ సహాయం పేదవారికే కాకుండా దిగువ మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కూడా కల్పించారు. ప్రస్తుతం 80 మంది వాలంటీర్లు అలాంటి విద్యార్థుల కోసం వెతుకుతున్నారు. 10వ తరగతిలో 90% కంటే ఎక్కువ మార్కులు వచ్చి పై చదువులకు ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఉన్నవారి గురించి తెలుసుకొని ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని పరిశీలించి 10, 12 తర్వాత 4 సంవత్సరాల కాలేజీ, హాస్టల్, ట్రైనింగ్తో పాటు వారు కోరుకున్న వృత్తి విద్య కోసం ఎప్పటికప్పుడు ఫీజులు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థి వికాస్ యోజన తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చేసే పొదుపునకు, మంచి కళాశాలలో 4 సంవత్సరాలు చదివేందుకు అవసరమైన విద్యా రుసుము మధ్య వ్యత్యాసాన్ని పూరిస్తుందని ఇక్కడ తెలుసుకోవడం చాలా ముఖ్యం.
విద్యార్థి వికాస్ యోజన వల్ల అనేక మంది దాతల సహకారంలో వేలాది మంది చిన్నారులకు అందమైన భవిష్యత్తు రూపుదిద్దుకోవడమే కాకుండా రానున్న కాలంలో ఆదర్శవంతమైన సమాజం కూడా ఏర్పడుతుందని సేవా సహయోగ్ ముంబై డైరెక్టర్ల బోర్డులో ఒకరైన కిషోర్ మోఘే ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ సహకారంతో ముందుకు సాగుతున్న ఈ పిల్లలు భవిష్యతులో దాతల జాబితాలో చేరడం ప్రారంభిస్తారు. దీనికి గొప్ప ఉదాహరణ శాస్త్రవేత్త సచిన్ సూర్యవంశీ. ప్రస్తుతం ఫార్మసీ రంగంలో సచిన్కు మంచి పేరుంది. విద్యార్థి వికాస్ యోజన సహాయంతో చదివిన సచిన్, బ్యాంకులో 1.4 లక్షల రుణం తీసుకుని ఇద్దరు పిల్లల చదువుకు పూర్తి బాధ్యతగా తన జీతం నుంచి ఈ రుణాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించాడు. సమాజ రుణం తీర్చుకోవాలనే భావన ఇక్కడితో అనుబంధం ఉన్న ప్రతి విద్యార్థిలో ఉంటుంది.
ఒక వ్యక్తి ఆలోచనలకు వయస్సు పరిమితి ఎప్పుడూ ఉండదు. జీవితపు మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి తన బాధ్యతలు, ఇల్లు, కుటుంబం గురించి ఆలోచిస్తాడు. అలాగే రెండో అధ్యాయంలో అతను సమాజానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే, మనం సమాజం నుండి ఏమి తీసుకున్నామో, దానిని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకోవడం అంత కష్టమేమి కాదు. 2500 మంది పిల్లల భవిష్యత్తు రూ. 10 కోట్లతో మెరుగుపడిందంటే కారణం జీవితంలో ఎంతో మంది తమ జీవితంలోని రెండో అధ్యాయంలో సమాజానికి, దేశానికి సహకారాన్ని అందించాలనుకోవడం ద్వారా సాధ్యమైంది. వారికి సమాజాభివృద్ధి కోసం పాటుపడే సామర్థ్యం అనుభవం ఉంటుంది. ఆ విధంగా భావితరాలకు బంగారు కలాన్ని అందించవచ్చని రవీంద్ర కార్వే జీ, అరుణ్ కర్మాకర్ జీ, శరద్ గంగల్ జీ, రాజు హెంబర్డే జీ, అభిజీత్ ఫన్నీస్ జీ నిరూపించారు.