నిత్యం మంగళాన్ని చేకూర్చేవాడే శివుడు

బ్రహ్మ మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం
లింగ స్వరూపుడైన శివుని ఆరాధన హైందవ సంస్కృతిలో అతి ముఖ్యమైంది. మంగళకరుడు, శుభకరుడైన శంకరుని పూజలో భారతీయులంతా పునీతులవుతుంటారు. శివుడు, శంకరుడు,చంద్రశేఖరుడు, కాలుడు అని పేర్లు కలిగిన ఈ శివుని విశేషాలను శాస్త్రీయంగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయాలి.
శివం అంటే శుభం, మంగళం. శాంతిని కలిగించే వాడు శంకరుడు. ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు శివుడు. కాలానికి మూలమైన వాడు మహా కాలుడు. ఆరోగ్యాన్నిచ్చే వాడు వైద్యనాథుడు. ఈ విధంగా ఎన్ని పేర్లతో మనం పిలుచుకున్నా.. దానిలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే వుంటుంది. భారతీయమైన దేవతామూర్తుల రూపం వెనుక ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. ప్రతి మూర్తి కూడా ఏదో ఒక ప్రత్యేక భావాన్ని చెబుతూనే వుంటుంది. అన్నింటికీ సంకేతార్థాలు వుంటాయి. ఇదంతా శాస్త్రీయమే. దానినే పూర్వం ఆధ్యాత్మికం అని పిలిచారు. అన్ని దేవతామూర్తుల లాగే శివుని మూర్తికి కూడా ప్రత్యేకత వుంది.
మన జీవనానికి ఆలంబనమయ్యే, మనని భరించే, మన ఇబ్బందిని సహించే, మనం జీవించే భూమి శివలింగానికి సంకేతం. భూమి మొత్తాన్ని మనం ఊహించలేం. దర్శించలేం కాబట్టి సంకేతంగా భూమి ఆకృతిలో వుండే శివలింగానికి పూజ చేసే సంప్రదాయం మనకు ఏర్పడింది. శివునికి కూడా వేరు వేరు పేర్లు ఏర్పడటం వెనుక ఇదే దృష్టి వుంటుంది. భూమి, శివ సామ్య దృష్టి వల్లనే ఈ విషయం మనకు అర్థమవుతుంది. భూమిపైన మూడింట రెండు వంతుల జలం వుంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని శివునికి ‘‘గంగాధరుడు’’ అని పేరు పెట్టుకున్నాం. భూమి ఆకాశంలో ఏ ఆధారం లేకుండా తిరుగుతుందనే భావనతోనే శివునికి దిగంబరుడని నామకరణం. భూమికి చంద్రుడు ఉపగ్రహం. భూమి చుట్టూ తిరుగుతూ చంద్రుడు తిరుగుతూ వుంటాడు. భూమి మీద వుండే వారికి చంద్రుడు కనిపించే విధానాన్ని బట్టి ఆలోచించి శివునికి ‘‘చన్ద్రశేఖరుడు’’ అని పేరు పెట్టుకున్నాం. భూమి చుట్టూ వుండే విద్యుదయస్కాంత శక్తికి సర్పాలు సంకేతం అవుతాయి.
అందుకే శివునికి ‘‘సర్పహారుడు’’ అని పేరు. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే మనకు రాత్రింబవళ్లు, కాలం అనేవి ఏర్పడతాయి కాబట్టి శివునికి ‘‘కాలుడని’’ పేరు. భూమిపైన జీవించే జీవికి ఒక కాలం ఏర్పరచి, కాలం తీరిన తర్వాత ఆ జీవిని తనలోనే ఈ భూమి కలుపుకుటుంది కాబట్టి శివునికి లయ కారుడు, మహా కాలుడు అని పేరు పెట్టుకున్నాం. భూమి తన చుట్టూ తాను తిరగడం (ఆత్మ భ్రమణం), సూర్యుని చుట్టూ తిరగడం (పరిభ్రమణం)తో పాటు విషు భ్రమణం అనే మూడు రకాలైన భ్రమణాలు వుండటం వల్లనే శివున్ని ‘‘త్రయంబకుడు, త్రిశూల ధారి’’ అనడానికి మూలం. భూమి తిరుగుతూ వుంటే ఏర్పడే నాదానికి సంకేతమే శివుని చేతిలోని డమరుకం. మూడు రకాలైన గమనాలకు మూలంగా కనిపించే నృత్య రూపమే ‘‘నటరాజ తాండవం’’.
భూమి చుట్టూ వున్న ఓజోన్ పొరలోని పాంచభౌతిక శక్తికి సంకేతమే పార్వతీదేవి. భూమి మధ్యలోని గురుత్వాకర్షణ శక్తికి సంకేతమే ‘‘గణపతి’’. భూమి చుట్టూ వుండి సౌర తుఫానుల నుంచి రక్షించడమే కాకుండా, మన కమ్యూనికేషన్ వ్యవస్థలకు ప్రాణం పోస్తున్న విద్యుదయస్కాంత తరంగ శక్తి ‘‘కుమార స్వామి’’. ఇది సదాశివ రూపం. పూర్ణమైన శాస్త్రీయ రూపం. ఇదే ప్రతీక. ఈ ప్రతీకల ద్వారానే శివుని విశిష్ట రూపం అర్థమవుతుంది.
అభిషేక ప్రియ శివ :
శివుడు అభిషేక ప్రియుడు. ఆకాధం నుంచి పడిన కొద్ది వర్షానికే పరవశించి లోపల వున్న ఎన్నో గింజలకు ప్రాణం పోసి మొలకలను మనకు అందిస్తోంది భూమి. ఆ విధంగా నిరంతరం భూమి మీద పడే జలం వల్ల మనలోని తాపాలు తీరడమే కాక ఆశలు, కోరికలు అనే మొలకలను చిగురెత్తిస్తుందీ భూమి కాబట్టి, భూమికి ప్రతీక అయిన శివునికి నిరంతరం జలాభిషేకం చేయడం, తద్వారా మన భావాలకు రూపు తెచ్చుకోవడం భారతీయ సంప్రదాయం. అభిషేకం శుద్ధతకు సంకేతం. తమను తాము శుద్ధి చేసుకోవడం ద్వారా కైవల్య ప్రాప్తి కలుగుతుందనే భావనే అభిషేకం. శరీర శుద్ధి, మన శుద్ధి ద్వారా విశ్వశక్తి తమ శక్తిగా మారుతూ వుంటుంది. అప్పుడే మనం విశ్వనాథులమవుతాం. మన దేహం దేవాలయం అవుతుంది.
ప్రదక్షిణం :
శివునికి ప్రదక్షిణం కూడా ముఖ్యమే. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల శక్తిని సంపాదించుకుంటుంది. తాము శక్తివంతులమైతే తమ చుట్టూ ప్రపంచం వుంటుంది అనడానికి భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడు సంకేతం అవుతాడు. ప్రదక్షిణాన్ని మనకు నేర్పించిన శివుని చుట్టూ మన శరీరాన్ని, మనసును తిప్పడం వల్ల మన మనస్సు శక్తి వంతమై, రోగాన్ని పోగొట్టుకుంటుంది. శక్తిమంతమవుతుంది. దేని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నామో దానిలాగే మనం తయారవుతాం. అందుకే ప్రదక్షిణం నేర్పించిన భూమి చుట్టూ మన మనస్సును, శరీరాన్ని తిప్పడం ద్వారా మనమూ శివ స్వరూపులమవుతాం.
ఉపవాసం :
శివరాత్రి నాడు ఉపవాసం చేసే సంప్రదాయం అందరికీ వుంది. అయితే ఉపవాస అర్థం ఈ రోజుల్లో పూర్తిగా మారిపోయింది. ఉప అంటే సమీపం అని అర్థం. వసతి అంటే ఉండడం. సమీపంలో వుండటం అని అర్థం. భగవంతుడు లేదా శక్తికి సమీపంలో మన శరీరాన్ని, మనస్సును కేంద్రీకరించాలంటే ఆహారం కొంత అడ్డంకి అవుతుంది. ఆహార స్వీకరణ తర్వాత ఆలోచనలు మారుతాయి. నిద్రకు ఆస్కారం వస్తుంది. అందుకే ఆహార భావన వదిలి, ఇతర ఆలోచనలకు కూడా దగ్గరికి రానీయకుండా భగవంతుని సమీపంలో రోజంతా కళ్లు మూసుకొని మనసును కేంద్రీకరించి, వుండటమే ఉపవాసం అర్థం. శక్తితో ఎక్కువ సేపు మనస్సు కలిసి వుంటే మనం కూడా శక్తిమంతులమవుతాం. శక్తిని సముపార్జించుకునే ప్రక్రియ ‘‘ఉపవాసం’’. కాలానుగుణంగా ఎవరైనా కొందరు బలహీనులకు పాలు, పళ్లవంటి ఆహారాన్ని అంగీకరించారు. అక్కడి నుంచి మొదలైన ఈ స్థితి ఉపవాసం అంటే అన్నం కాకుండా ఇతర ఉపాహారాలు అనే అర్థాన్ని సంతరించుకుంది. శివరాత్రి వంటి ప్రత్యేకమైన రోజుల్లో మనస్సును పూర్తిగా శివమయం చేసి, కూర్చోబెట్టడం ద్వారా విశేషమైన శక్తి కలుగుతుంది. కానీ ఈ ఉపాహార భావన వల్ల, ఆహారం మీద మనస్సును కేంద్రీకరించడం జరుగుతుంది. దీనిని గమనింి తమను తాము మార్చుకుంటూ ఉపాసనను పెంచుకుంటూ, ఉపవాస దీక్ష ద్వారా చైతన్యవంతులుగా, శక్తి స్వరూపులుగా మారాల్సిన అవసరం వుంది.
బిల్వార్చన, తులసీ అర్చన :
భూమి చుట్టూ ఒక ఓజోన్ పొర వుండటం వల్ల మనకు వాతావరణం ఏర్పడుతుంది. ఈ వాతావరణంలో కాలుష్యం ఎప్పటికీ ఏర్పడుతూ వుంటుంది. దానిని ఎప్పటికప్పుడు మనం తగ్గిస్తూనే వుండాలి. అటువంటి వాతావరణాన్ని శుద్ధి చేయడానికి బిల్వ వృక్షాలు వుపయోగం. దీనిని శ్రీసూక్తం చెబుతోంది. (మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ) అందువల్ల ఈభూమి మీద మనం కాలుష్య నివారకాలైన బిల్వ, తులసీ వృక్ష జాతులను అత్యధికంగా పెంచాలి. దానికి ప్రతీకగా మనం శివుని మీద బిల్వ, తులసీ పత్రాలతో పూజ చేసే సంప్రదాయం వచ్చింది.
విభూతి :
భూతి అంటే సంపద. విశిష్టమైన భూతి విభూతి. ఈ భూమిలోనూ, భూమిపైన మట్టిలోనూ అనేక సంపదలున్నాయి. ఈ భూమి ఎంతో ఉత్పాదక శక్తి కలిగింది. పై పొరలోని మట్టి వల్లనే ఈ ఉత్పాదన మనకు కనిపిస్తుంది. ఈ మట్టిలో అనేక ధాతువులు, ఖనిజాలున్నాయి. ఇటువంటి విశిష్టమైన, సారవంతమైన మట్టితో స్నానమే మృత్తికా స్నానం అనబడుతుంది. అటువంటి విశిష్టమైన మట్టిని ధరించే సంప్రదాయమే విభూతి. స్నానాలలో విభూతి స్నానం కూడా ప్రత్యేకం. అందుకే శివ భక్తులంతా ఈ భూమి మీది విశిష్టమైన మృత్తికను, భస్మం చేసిన మట్టిని నామధారణ కోసం వినియోగిస్తూ వుంటారు.
ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్ :
ఈశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. మనకు ప్రత్యక్షంగా కనిపించే ఐశ్వరం అంతా ఈ భూమిలోనే వుంది. నీరు, బొగ్గు, బంగారం వంటి అనేక మూల ఖనిజాలు, సహజవాయువు, పెట్రోల్ ఉత్పత్తులు అన్నీ ఈ భూమిలోనే వున్నాయి. ఉత్పాదక శక్తి కలిగిన ఈ భూమి ఎన్నింటినో సృష్టిస్తుంది కూడా. అందుకే శివునికి ఈశ్వరుడు అని పేరు. ఈ భావనతో చేసే శివపూజ వల్ల మన ఇంటినిండా ప్రత్యక్షమైన ఐశ్వర్యం లభించడమే కాకుండా, శరీరానికి, మనసుకు ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత, సంతృప్తి వంటివి లభిస్తాయి.
లింగోద్భవం :
మాఘ బహుళ త్రయోదశి అనంతర చతుర్దశి వున్న రాత్రి నాడు ‘‘మహా శివరాత్రి’’ గా నిర్ణయిస్తుంది ధర్మశాస్త్రం. ప్రతి మాసంలోనూ వచ్చే ఇద తిథిని మాస శివరాత్రిగా పూజలు చేసే సంప్రదాయం వుంది. శివరాత్రి నాటి లింగోద్భవ కాలాన్ని భూమి పుట్టిన రోజుగా మనం గమనించాలి. ఈ భూమి పుట్టుకను పండుగగా జరుపుకుంటూ, ఈ భూమి సర్వశ్రేయంగా, అందరికీ వినియోగకరంగా, మరింత సంపన్నంగా వుండాలని కోరుకునే వారు భారతీయులు. అందుకే ఈ శివరాత్రి రోజున ఉపవాస దీక్షలతో ఎన్నో విశిష్టమైన కార్యాలతో, నిరంతర అభిషేకాలు చేస్తూ ఆనందిస్తుంటారు. లింగోద్భవం అంటే సముద్రం అంతా ఒక పక్కకు పోయిన తర్వాత భూమి బయటకు రావడమే. మనం నివసించే, మనకు పంటలనిచ్చే భూమి రూపాన్ని పొందడమే. అందుకే మనందరికీ ఆధారభూతమైన ఈ శివరాధన అందరం తప్పకుండా నిర్వహించాలి. భూమికి ఉత్సవాన్ని చేస్తూనే వుండాలి. భూమి ఉత్పాదన అర్థం చేసుకొని, మనని కాపాడే భూమిని మనం కాలుష్యం లేకుండా కాపాడుకుంటూ, భావి తరాల ప్రశాంత జీవనానికి అవకాశం ఇవ్వాలి.
ఈ విధంగా సదాశివ కుటుంబాన్ని ఆరాధిస్తూనే వుండాలి. దీని వెనుక వున్న శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. భావనను అత్యున్నతంగా మార్చుకుంటూ వుండాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారుతూనే వుండాలి. మోక్షగాములు కావాలి. పంచభూతాత్మకమైన పంచాక్షరీ మంత్రాన్ని ఉపాసించి, శక్తిని పెంచుకోవాలి.
అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు….
– ఆచార్య సాగి కమలాకర శర్మ,  తెలుగు శాఖాధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *