ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతికి జీవం పోస్తున్న ‘‘అష్టలక్ష్మి’’
ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రకరకాల అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. అసోంలోని తేయాకు తోటల నుంచి మిజోరాంలోని లుషాయ్ కొండల వరకు, మణిపూర్ సహజ సిద్ధ నదుల నుంచి నాగాలాండ్ అద్భుతమైన పండుగల వరకు, ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాలు వాటి గొప్ప సాంస్కృతిక లక్షణాలు కలిగి వున్నాయి. అయినా… వాటికి సంయుక్తంగా ఓ గుర్తింపు కూడా వుంది. ఈశాన్య భారతీయ సంప్రదాయ కళలు, సాంస్కృతిక పద్ధతులను ప్రోత్సహించాలని, ప్రపంచానికి తెలియజేయాలని ఢిల్లీలో మూడు రోజుల పాటు సాంస్కృతిక ‘‘అష్టలక్ష్మి మహోత్సవం’’ జరిగింది.
అష్టలక్ష్మి మహోత్సవం ద్వారా ఈశాన్య రాష్ట్రల సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడమే కాకుండా అక్కడ ఆర్థికాభివృద్ధి ఉత్ప్రేకరకంగా పనిచేస్తుంది. ఈ మహోత్సవం కళాకారులకు, నేతలన్నలకు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. రానున్న కాలంలో ‘వోకల్ ఫర్ లోకల్’’ ను మరింత బలాన్ని చేకూరుస్తుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనాలున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఈశాన్య భారత సామర్థ్యం విదేశాలకు తెలిసివచ్చింది. ఈశాన్య సంస్కృతి, సంప్రదాయాలు, వంటకాలు, ఇతర ఉత్పత్తుల ప్రదర్శన కూడా జరిగింది. పెట్టుబడిదారులు, రైతులు, కళాకారులకు ఇదో మంచి కార్యక్రమంగా ఉపయోగపడింది.
మరోవైపు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. భారతీయ సంప్రదాయాలను ప్రస్తావించారు. లక్ష్మీ దేవిని ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్య దేవతగా పిలుస్తారని అన్నారు. లక్ష్మీ దేవి ఎనిమిది రూపాలను పరిగణనలోకి తీసుకొని, ఎప్పుడు పూజించినా, ఎనిమిది రూపాల్లో పూజిస్తారన్నారు. ఎనిమిది రాష్ట్రాలు అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలో అష్టలక్ష్మి కనిపిస్తుంది. ఈశాన్య ప్రాంతాల ఉజ్జ్వల భవిష్యత్తుకి ప్రతీక అష్టలక్ష్మి.
అష్టలక్ష్మి యోజన అంటే…
1. ఆదిలక్ష్మి : ప్రతి రాష్ట్రంలో సంస్కృతి బలంగా విస్తరించింది. ఈశాన్యంలోని ప్రతి రాష్ట్రం దాని సంప్రదాయాన్ని, సంస్కృతిని వేడుకుగా జరుపుకుంటుంది. మేఘాలయాకి చెందిన చెర్రీ బ్లాసమ్ పండుగ, నాగాలాండ్ హార్న్ బిల్, అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఆరెంజ్ ఫెస్టివల్, మిజోరం – చాప్చర్ కుట్, అసోంకి చెందిన బిహు, మణిపూర్ కి చెందిన నృత్యం ఇవన్నీ… గొప్ప వైవిధ్యానికి ప్రతీకలు.
2. ధనలక్ష్మి : ఈశాన్యంలోని ఖనిజాలు, చమురు, తేయాకు తోటలు, ఇలా జీవవైవిధ్య సంగమం. పుష్కలమైన సహజ వనరులు వున్నాయి. అపారమైన పునరుత్పాదక ఇంధన సామర్ధ్యం వుంది. ఇది మొత్తం ఈశాన్య ప్రాంతానికి వరం.
3. ధాన్య లక్ష్మి : ప్రకృతి సేద్యానికి, సేంద్రీయ వ్యవసాయానికి, పౌష్టికాహారానికి ఈశాన్యం ప్రసిద్ధి. ధాన్యలక్ష్మి ఆశీస్సులున్నాయి. సిక్కిం భారత్ లో మొదటి సంపూర్ణ సేంద్రీయ రాష్ట్రం. ఈశాన్య ప్రాంతంలో పండించే వరి, వెదురు, సుగంధ ద్రవ్యాలు, ఔషద మొక్కలు వ్యవసాయ శక్తికి నిదర్శనం. ఆరోగ్యకరమైన భారతాన్ని, పోషకాహార విలువలను అందించడంలో ఈశాన్య ప్రాంతం ప్రధాన పాత్ర పోషిస్తుంది.
4. గజలక్ష్మి : ఈశాన్య ప్రాంతంలో విస్తారమైన అడవులు, కజిరంా మానస్ మెహోవో వంటి జాతీయ ఉద్యానవనాలు వున్నాయి. వన్యప్రాణుల అభయారణ్యాలు వున్నాయి. అద్భుతమైన గుహలు, ఆకర్షణీయ సరస్సులు వున్నాయి.
5. వీరలక్ష్మి : మహిళల ధైర్య సాహసాలు, శక్తి సమ్మేళనానికి ప్రతీక వీరలక్ష్మి. ఈశాన్య రాష్ట్రాల మహిళలు బానిసత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన తీరు అద్భుతం. జానపద గాథల నుంచి స్వాతంత్ర పోరాటం వరకు, రాణీ గైదిన్ లియూ, కనకలత బరువా, రాణి ఇందిరా దేవీ, లల్ ూ రోపిలియానీ వంటి మహిళలు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
6. జయలక్ష్మి : జయలక్ష్మి కీర్తి, ప్రతిష్టలను తీసుకొస్తుంది. దేశం యావత్తు పెట్టుకున్న ఆశలు, అంచనాలలో ప్రధాన పాత్ర ఈశాన్య ప్రాంతానిదే. తన సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచ స్థాయిలో సంధానించాలని చూస్తున్నారు. తూర్పు ప్రాంత దేశాలలో వున్న అపార అవకాశాలతో భారత్ ను ఈశాన్య ప్రాంతం కలుపుతుంది.
7. విద్యా లక్ష్మి : ఐఐటీ గౌహతి, ఎన్ఐటీ సిల్చేర్, ఎన్ఐటీ మేఘాలయ, ఎన్ఐటీ అగర్తలా, ఐఐఎం షిల్లాంగ్ వంటి విద్యా కేంద్రాలున్నాయి. ఈశాన్య ప్రాంతానికి మొట్టమొదటి ఎయిమ్స్ కూడా వుంది. దేశంలోనే తొలి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని మణిపూర్ లో నిర్మిస్తున్నారు.