చరిత్ర చెబుతూ ప్రజలను చైతన్యం చేయాలి : అరవింద రావు
ప్రజలకు చరిత్రను తెలియజేస్తూ వారిని చైతన్యవంతులుగా చేయాలని, చరిత్ర గురించి తెలుసుకోకుంటే చరిత్ర మనల్ని మింగేస్తుందని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పూర్వ డీజీపీ కె.అరవింద రావు హెచ్చరించారు. చరిత్రలో జరిగిన సంఘటనలను రచయితలే ప్రజల ముందు వుంచగలరని, దీనికి సంబంధించి పరిశోధనాత్మక విశ్లేషణ చాలా అవసరం అన్నారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో… రాబోయే రోజులలో హిందువులపై దాడులు జరగకుండా వుండాలంటే ఏం చేయాలో కూడా లోతైన పరిశోధనలు చేసి, రచయితలు రాయాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయ నేతలకి అవగాహన తేవాలని, లేదంటే వారు తీసుకొనే కొన్ని నిర్ణయాల వల్ల ఓ వర్గం తమకు అన్యాయం జరిగిందని చెబుతూ.. మరింత రెచ్చిపోయే ప్రమాదం వుందని అరవిందరావు సూచించారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికగా జరిగిన “బంగ్లాదేశ్ హిందువుల అజ్ఞాత మారణకాండ” పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బంగ్లాదేశ్ హిందూ శరణార్థుల చేదు అనుభవాలను సంకలనం చేసిన ఈ పుస్తకంలోని సంఘటనలను ఆయన ప్రస్తావిస్తూ 1971 ప్రాంతంలో బంగ్లాదేశ్లోని హిందువులు చాలా భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నారని, అవి ఎంత భయంకరమూ వాటిని అనుభవించిన వారికి మాత్రమే తెలుసన్నారు. వాటిని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఎందుకు అలా చేశారు? ఎలా చేయగలిగారు? ఇప్పుడు అలాంటివి జరగకుండా వుండాలంటే ఏం చేయాలనే దిశగా ప్రజల్ని ఎలా చైతన్యం చేయాలో ఆవగాహన చేసుకుని ఆలోచించాలని ఆరవిందరావు సూచించారు.
హింసకు పాల్పడినవారికి… అది (హింస) వారి మతం ప్రకారం ధర్మమే అన్న కోణంలో చేస్తున్నారని, దానికి సమాధానం వెతకడం చాలా కష్టమని అన్నారు. మతానికి, ధర్మానికి తేడా వుందని, మతమంటే ఓ అభిప్రాయమని, ధర్మం అంటే శాశ్వతమైన మానవ విలువలని వివరించారు. ధర్మం సమాజాన్ని కలిపి వుంచుతుందన్నారు. ఇటీవల ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా ధర్మం విషయంలో చాలా మంచి సూచనలు చేశారని గుర్తు చేశారు. ధర్మం స్వరూపాన్ని, భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోవాలని సూచించారన్నారు. అలాగే మత గ్రంథాలపై సరైన వ్యాఖ్యానాలు రాయాలని కూడా మోహన్ భాగవత్ అన్నారని, మత గ్రంథాలను సరిగ్గా అర్థం చేసుకోలేని కారణంగా, ధర్మ స్వరూపాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక హింస జరుగుతోందని ఆయన అన్నారని, ఇది చాలా గొప్ప సలహా అని అరవిందరావు పేర్కొన్నారు. అయితే.. ఈ పని రచయితలు మాత్రమే చేయగలరని అన్నారు.
భారత్తో సరిహద్దులు పంచుకున్న ఇస్లామిక్ దేశాలతోనే ఇబ్బందులు వస్తున్నాయని, ఇతర ఇస్లామిక్ దేశాలతో మనకు స్నేహ సంబంధాలే వున్నాయని అరవిందరావు తెలిపారు. దీనికి అనేక కారణాలున్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జనాభా నిష్పత్తి మారుతోందని, దీనిపై కూడా దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. దీనిపై ఓటర్లను, ప్రజలను నిత్యం చైతన్య పరచాల్సిందేనని అన్నారు. సూపర్ పవర్ అని అనుకుంటున్న దేశాలు చిన్న చిన్న దేశాలతో ఆటలాడుకుంటున్నాయని, ఈ మధ్యే డీప్ స్టేట్ గురించి కూడా పార్లమెంట్లో చర్చలు జరిగాయన్నారు. ఈ వర్గాలు వున్నట్టుండి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను నియంత అంటూ రాజకీయ కారణాలతో కథనాలు వ్యాప్తి చేశారన్నారు. ఈ కథనాల ఆధారంగా బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించి, దీని ద్వారానే అధికార మార్పిడి చేశారన్నారు. ఇది కూడా మన దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ… దేశంలో బలమైన నాయకత్వం వున్న కారణంగా అది సాధ్యం కాలేదని అరవింద రావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ హిందూ శరణార్థి ప్రభీర్ కుమార్ మండల్ మాట్లాడుతూ తాను బంగ్లాదేశ్లో పుట్టానని, కానీ.. పెరిగింది అంతా తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోనే అని తెలిపారు. 1994లో తనకు సంఘ్ పరిచయం అయ్యిందని, ఆ వేదికగా తమ బాధలు చెప్పుకుంటున్నానని తెలిపారు. 1970లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారిందని, ఈ విభజన తర్వాత బంగ్లాదేశ్లో ఇస్లామిక్ మతోన్మాదులు దాడులు చేయడం ప్రారంభించారన్నారు. అలాగే మహిళలపై అత్యాచారాలు, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చేశారన్నారు. మన ధర్మాన్ని కాపాడుకోవడానికే తాము ఇక్కడికి వచ్చామని,లేదంటే మత మార్పిళ్లు జరిగేవన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికే చాలామంది భారత్కి వచ్చేశారన్నారు. ఇలా వచ్చిన వారికి పునరావాసం ఇచ్చారని, నాలుగైదెకరాల భూమి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. తమ సొంత మేనమామ ఇప్పటికీ బంగ్లాదేశ్ లోనే వున్నారని, ఆయన ప్రభుత్వ ఉద్యోగి అని తెలిపారు. వారు చాలా భయంతో జీవిస్తూ రోజూ గోడు వెళ్లబోసుకుంటున్నాడని ప్రభీర్ వెల్లడించారు. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చాలా ఇబ్బందిగా వుందని తెలిపారు.
ఆర్గనైజర్ పత్రిక సౌత్ ఇంచార్జి కుంటి సురేందర్ మాట్లాడుతూ.. శరణార్థులను ఇంటర్వ్యూ చేయడానికి తాము స్వయంగా కాగజ్ నగర్కి వెళ్లామని తెలిపారు. శరణార్థుల గాథలు ఇప్పటి వరకు పుస్తకాల్లో చదవడమే వుండేదని, కానీ.. ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుసుకోగలిగామని చెప్పారు. వారి ప్రమేయం లేకుండానే రాజకీయ క్రీడ కారణంగా ఓ దేశాన్ని వదిలిపెట్టాల్సిన దుస్థితి వారిదన్నారు. ఇప్పటికీ వారి కళ్లల్లో భయం వుందని, తమ పిల్లలకు కూడా అప్పటి విషయాలు చెప్పలేకపోతున్నామని వాపోయారని వెల్లడించారు. వారి కళ్ల ముందే వారి కుటుంబీకులను ఎత్తుకెళ్లిన సందర్భాలూ వున్నాయని, వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ పుస్తకంలో పొందుపరిచామని సురేందర్ తెలిపారు. అలాగే మరో కుటుంబం బంగ్లాదేశ్ నుంచి భారత్కి సరిహద్దు ద్వారా రావడానికి 45 గంటల సమయం పట్టిందని, రాత్రి పూట పొలాల గట్ల నుంచి వచ్చారన్నారు. ఈ సమయంలో ఒకరు చనిపోయారు కూడా అని తెలిపారు. ఇలాంటి భయంకర పరిస్థితులు వున్నాయని… ఇవన్నీ పుస్తకంలో పొందుపరిచామని తెలిపారు. తెలంగాణలో ఉన్న శరణార్థులు 1974 ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలంలోకి వచ్చారని, ఆ సమయంలో స్థలం ఇచ్చారు కానీ.. ఇతర సౌకర్యాలేవీ లేవన్నారు. అయినా… వారు ఇప్పుడు వారి కాళ్ల మీద వారు నిల్చున్నారన్నారు. ఆ కుటుంబంలోని సభ్యులు కొందరు భారత ఆర్మీలో పనిచేస్తున్నారని, ఇది ఎంతో ప్రశంసనీయని అన్నారు.
“బంగ్లాదేశ్ హిందువుల అజ్ఞాత మారణకాండ” పుస్తక అనువాదకురాలు, సంవిత్ ప్రకాశన్ సభ్యురాలు నడింపల్లి పరిమళ మాట్లాడుతూ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు ఎదుర్కొన్న సంఘటనలు జరిగిన సందర్భంలో ఆయా వ్యక్తులపై పడిన ప్రభావాలను ఈ పుస్తకం విశ్లేషించిందన్నారు. బాధితులు ఎంతటి శారీరక, మానసిక హింసను అనుభవించారో ఆ పుస్తకంలో వుందన్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా పడ్డారన్నారు. అయితే.. ప్రస్తుతం కాస్త సుఖంగా వున్నప్పటికీ, 70 సంవత్సరాలు గడచిన తర్వాత నాటి పరిస్థితులను గుర్తుచేసుకుంటే.. అవి అనుభవించిన వారి వ్యధ వర్ణనాతీతమని అన్నారు. ఓ మనిషి మరో మనిషితో ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? అన్న కోణం కూడా వుంటుందన్నారు.
సంవిత్ ప్రకాశన్ డైరెక్టర్ కుమారి శైలజ మాట్లాడుతూ.. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతంలోని శరణార్థుల జీవిత గాథలను డాక్యుమెంట్ చేయడం జరిగిందని, ఈ పుస్తకాన్ని కన్నడం నుంచి తెలుగులోకి అనువాదం చేశారని తెలిపారు. ఈ పుస్తకానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముందు మాట రాశారన్నారు. దీనికి సంబంధించి ఆంగ్ల పుస్తకం కూడా వుందన్నారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా సంవిత్ ప్రకాశన్ సంస్థ నుంచి చాలా పుస్తకాలు ప్రచురితం చేశామని పేర్కొన్నారు.
ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ పుస్తకాన్ని గురించి మరిన్ని వివరాలు అందిస్తూ మొదటి 15 అధ్యాయాలు కన్నడం నుంచి తెలుగులోకి వచ్చాయన్నారు.రాయచూర్ దగ్గర సింధనూర్ అనే ఓ గ్రామం వుందని, అక్కడ శరణార్థి శిబిరం వుందని పేర్కొన్నారు. అయోధ్య పబ్లికేషన్ టీం వినాయక్ భట్, రోహిత్ చక్రతీర్థ, గీర్వాణి, వృషాంక్ భట్ ఆ శిబిరానికి వెళ్లి శరణార్థులను ఇంటర్వ్యూ చేశారని తెలిపారు. ఆ అనుభవాలతో కన్నడంలో మొదట పుస్తకం వచ్చి, ఆ తర్వాత ఆంగ్లంలోకి అనువాదం అయ్యిందన్నారు. ఆ సమయంలోనే సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర కూడా ఇలాంటి వారు వున్నారని తెలియడంతో వారిని ఇంటర్వ్యూ చేసి “బంగ్లాదేశ్ హిందువుల అజ్ఞాత మారణకాండ” పుస్తకంలో వాటిని కూడా చేర్చామని తెలిపారు.