పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ,పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే వున్నాయి. తాజాగా భారత ప్రభుత్వం పాక్ పై కొత్త చర్యకు పూనుకుంది. పాకిస్తాన్ కి చెందిన 16 యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్ లో నిషేధించంది. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యూట్యూబ్ ఛానెల్ కూడా వుంది. అలాగే అర్జూ కజ్మీ, సమయ్యద్ ముజమ్మిల్ షా ఛానెల్ తో పాటు డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ లాంటి ఛానెళ్లపై కూడా నిషేధం అమలులోకి వచ్చింది.
భారత ప్రభుత్వం ఈ చర్య తీసుకోగానే.. పాక్ ఛానెళ్ల కోసం యూట్యూబ్ లో వెతగ్గానే.. ‘‘ఇందులోని కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అన్న సందేశం వస్తోంది. భారత్ కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలతో పాటు మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ఆ ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.ఈ కారణంగానే భారత ప్రభుత్వం వీటిని నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత ప్రభుత్వం పాక్ కి చెందిన మీడియా ఛానెళ్లను నిషేధించడంతో భారత్ లో ఇక పాకిస్తాన్ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడినట్లైంది. తప్పుడు ప్రచారానికి బ్రేకులు పడినట్లైంది.