సంచార జాతులకు దుప్పట్లను పంపిణీ చేసిన సామాజిక సమరసత వేదిక, రోటరీ క్లబ్
కామారెడ్డి జిల్లాలో నివసిస్తున్న సంచార జాతి వారికి సామాజిక సమరసతా వేదిక, రోటరీ క్లబ్ సంయుక్తంగా దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హోలియా దాసరి, పెద్దమ్మల వారు, వీరభద్ర, ఎరుకల, గంగిరెద్దుల వారు పాల్గొన్నారు. ప్రస్తుతం చలి విపరీతంగా బాధిస్తోందని, ఈ నేపథ్యంలో సంచార జాతుల వారికి దుప్పట్ల పంపిణీ చేశామని ఆ సంస్థల ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముందు సామాజిక సమరసత వేదిక కార్యకర్తలు సంచార జాతి వారు నివసిస్తున్న ఇళ్లకు వెళ్లి, సర్వే చేసి, వారందర్నీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దేశంలోని జనాభాలో అత్యంత దారిద్ర్య స్థితిలో జీవిస్తోందని సంచార జాతులేనని సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా వీరు విద్య, వైద్యానికి, పక్కా గృహ నిర్మాణానికి, ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు.