జనపనారతో గ్రామాల ఆర్థిక గతులను మార్చేస్తున్న ‘‘ఏడుగురు స్నేహితులు’’
భారత వ్యవసాయ విపణిలో ఆ ఏడుగురు స్నేహితులు కొత్త ఒరవడిని సృష్టించారు. బాంబే హెంప్ కంపెనీ స్థాపించి ఎందరో రైతులకు ఉపాధిని చూపించారు. జనపనారను ప్రధాన పంటల జాబితాలోకి చేర్చి రైతులకు ఆర్థిక వనరుగా మార్చారు.అందరిలాగే వారు పగటి కలలు కనేవారు. సైన్స్, ఫిక్షన్, ఆదర్శం, ఆతృతలు కలిసిన స్నేహితుల సమూహం వారిది. తాము ప్రపంచాన్ని మార్చగలమన్న విశ్వాసం మది నిండా నింపుకున్నారు. కనీసం కొంత మంది జీవితాలనైన ప్రభావితం చేయగలమనుకొనే ధీమాతో జీవితంలో ముందడుగు వేశారు. అది 2010 సంవత్సరం.. ముంబాయి విశ్వవిద్యాలయంలో భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చ జరుగుతోంది. వాటి పరిష్కారానికి మార్గాల మేధోమథనం జరిగింది. ఆస్ట్రేలియా పారిశ్రామిక రంగంలో పెను మార్పులు తెచ్చిన జనపనార వారి ఆ ఏడుగురు స్నేహితుల దృష్టిని ఆకర్షించింది. జనపనార ఉపయోగాలు.. దాని వల్ల కలిగే ప్రయోజనాలను వారు గుర్తించారు. ముఖ్యంగా భారతదేశంలో దానికి ఆదరణ లభిస్తుందని వారు భావించారు. వాళ్ళే బొంబాయి హెంప్ కంపెనీ స్థాపకులు చిరాగ్ టెక్చందానే, జాన్ పెస్టోన్ జామస్, సన్వర్ ఒబేరాయ్, దెల్జాడ్ దియోలివాలా, యస్ కొటాక్, అవినాశ్ పాండ్య, సుమిత్ షాలు.
స్నేహితులంతా కలిసి భారత వ్యవసాయం రంగం పై మూడు సంవత్సరాల పాటు పరిశోధనలు చేశారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారు. వివిధ సంస్థలతో కలిసి పనిచేశారు. తమ కలలకు ఓ రూపాన్ని ఇచ్చేందుకు కావలసిన అనుభవాన్ని సంపాదించుకున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను పండించేందుకు… జీవనోపాధి అవకాశాలను పెంచేందుకు.. సహజ వనరుల సద్వినియోగానికి బాంబే హెంప్ కంపెనీని స్థాపించారు. జనవరి 19, 2010లో ప్రారంభమైన ఈ కంపెనీ నేడు దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పనకు కృషి చేస్తోంది.
దక్షిణ ఆసియాలోనే బాంబే హెంప్ కంపెనీ తొలి జనపనార పరిశ్రమగా గుర్తింపు పొందింది. దీని వెనుక ఏడుగురు స్నేహితుల శ్రమ కూడా ఉంది. పరిశ్రమ ప్రారంభానికే ముందే వారు భవిష్యత్తులో తలెత్తే సమస్యలను గుర్తించారు. వాటిని ఎదుర్కొనేలా సన్నద్ధమయ్యారు. దేశంలో గంజాయి వల్ల కలిగే దుష్పరిమాణాల పై ఉన్నంత అవగాహన దాని వల్ల కలిగే ప్రయోజనాల పై లేదని సంస్థ వ్యవస్థాపకులు భావించారు. అంతేకాకుండా జనపనార పంటకు అనుగుణమైన వాతావరణం కూడా భారతదేశంలోని లేదనేది వారి అభిప్రాయం. కాబట్టి అందరినీ ఒప్పించి.. ముందుకు వెళ్ళవలసిన బాధ్యత సంస్థ పై పడింది. భారతదేశంలో ఇప్పటికీ కూడా తక్కువ టిహెచ్సీ కలిగిన అటవీ జనపనార మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దాని ఉత్పత్తి పై ఎటువంటి పరిశోధనలు జరగడం లేదు. పారిశ్రామిక మద్దతు కూడా అంతగా లభించకపోవడం కూడా పరిశ్రమ స్థాపనలో సమస్యలకు కారణమైంది. అలా పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టారు. అంతర్జాతీయ జనపనార కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, శాస్ర్తవేత్తలు, పరిశోధన సంస్థలు, రైతులు, గ్రామీణ సంఘాలు, పరిశ్రమలు, ప్రైవేటు సంస్థల వ్యవస్థాపకులు, భాగస్వాములు, వినియోగదారుల గురించి సమగ్ర పరిశీలన చేశారు. అనంతరం రైతులకు పరిశ్రమలకు లాభం చేకూర్చే విధంగా ప్రయోగశాల-పంట-యంత్రాలు-మార్కెట్ల అనుసంధానం అనే ప్రక్రియతో ముందుకు వెళ్ళారు.
భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వారు జనపనార పరిశ్రమకు అనుకూలమైన వాతావరణాన్ని దేశంలో రూపొందించుకున్నారు. స్థానిక పరిశ్రమల సామర్థ్యాన్ని పెంపొందించారు. ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనల ఫలితాలను భారత జనపనార పరిశ్రమకు అన్వయించుకున్నారు. అంతేకాకుండా పర్యావరణహిత ఉత్పత్తులను జనపనారతో అందించడం ప్రారంభించారు. ఇందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఎన్జీఓల సహకారాన్ని తీసుకున్నారు. బొంబె హెంప్ కంపెనీ జనపనారకు పారిశ్రామిక పంటగా గుర్తించింది. దాని పండిస్తున్న ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమ కార్యకలాపాలను విస్తరించింది. సేంద్రీయ పద్ధతుల్లో జనపనారను పండించేందుకు అధిక ప్రాధాన్యమిచ్చింది. మహిళ కళాకారులను వ్యాపారంలో భాగస్వాములను చేసి ఉపాధి కల్పించింది. ఆ విధంగా జనపనార ఉత్పత్తులను బొంబె హెంప్ కంపెనీ మార్కట్లోకి ప్రవేశపెట్టింది. గత రెండు సంవత్సరాల కాలంలో వినియోగదారుల నుంచి ఊహించిన ఆదరణను పొందింది.
జనపనారతో తయారు చేసే వస్త్రాలు వెచ్చదనాన్ని ఇస్తాయి. అంతేకాకుండా మృదువుగా కూడా ఉంటాయి. అంతేకాకుండా నాణ్యమైనవి కూడా. అంతేకాకుండా ఫర్నిచర్, గృహోపకరణాలు, దుస్తులు, బూట్లు, ఫర్నిచర్ తయారీలో కూడా ముడి సరుకుగా జనపనార ఉపయోగపడుతుంది. దీని వల్ల ఎందరో హస్త కళాకారులకు ప్రయోజనం చేకూరుతోంది. అంతేకాకుండా జనపనార విత్తనాలను ఆహారపదార్థాలుగా కూడా వాడుకోవచ్చు. నూనె, పండిని తయారు చేసుకోవచ్చు. వాటిలో అత్యధిక ప్రోటీన్లు ఉంటాయి. జనపనారతో తయారైన ఆహార పదార్థాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలతో బొంబె హెంప్స్ కంపెనీ కలిసి పనిచేసింది.
భారత వాతావరణానికి అనుకూలంగా పర్యావరణహితమైన ఇటుకలను, బ్లాకులను తయారు చేసేందుకు కంపెనీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వచ్చే ఏడాదిలోగా వాటిని భారత వ్యాపార విపణీలోకి తెచ్చేందుకు యత్నాలను ఆరంభించింది. ఇందుకు పెట్టుబడిదారులు, భాగస్వాములకు ఆహ్వానం పలుకుతోంది. త్వరలోనే రైతులు, ప్రైవేటు సంస్థలు, నిపుణుల సహకారంతో భవన నిర్మాణ సామాగ్రిని మార్కెట్లోకి తెస్తామని కంపెనీ వ్యవస్థాపకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ స్థాయిలో రైతులు, మహిళ కళాకారుల గౌరవం నిలబడేలా చేయడమే తమ ధ్యేయమని బాంబే హెంప్ కంపెనీ వ్యవస్థాపకులు చెబుతారు. అందులోనూ తాము పర్యావరణహితమైన విధానాలను అనుసరిస్తుండడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యతగా భావిస్తున్నట్లు వివరిస్తారు. దేశ అభివృద్ధిలో తాము భాగస్వాములమవుతున్నందుకు సంతోషంగా ఉందని ఏడుగురు స్నేహితులు అంటున్నారు.