16,300 కోట్ల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కి కేంద్రం ఆమోదం
క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. 16,300 కోట్ల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ను అమలు చేయనుంది. మన దేశంలో, ఆఫ్ షోర్ ప్రదేశాల్లో కీలకమైన ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మిషన్ ను చేపట్టనుంది. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఈ రంగంలో దేశం స్వావలంబనను సాధించడమే ఈ మిషన్ లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు.
ఈ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా అధిగమించేందుకు ప్రభుత్వం గత రెండేళ్లుగా పలు చర్యలు తీసుకుందన్నారు. ఈ రంగంలో స్వావలంభన సాధించాలనే విజన్కు అనుగుణంగా 2024-25 బడ్జెట్లో క్రిటికల్ మినరల్ మిషన్ ఏర్పాటును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. అరుదైన ఖనిజ వనరులు ఉన్న దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపరచుకోవడం, దేశీయంగా ఖనిజ నిల్వల అభివద్ధికి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటీ కంపెనీలను నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ప్రోత్సిహిస్తుందని మంత్రి చెప్పారు.