కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం .. క్యూఆర్‌ కోడ్‌లతో పాన్‌ కార్డుల నవీకరణ

దేశవ్యాప్తంగా కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించేందుకుగాను రూ.2,481 కోట్ల విలువైన జాతీయ మిషన్‌ (ఎన్‌ఎంఎన్‌ఎ్‌ఫ)కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.  పాన్‌ కార్డులను పూర్తిగా డిజిటలీకరణ చేయాలని, ప్రతి పాన్‌ కార్డుకు క్యూఆర్‌ కోడ్‌ కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,435 కోట్లతో చేపట్టనున్న పాన్‌ 2.0 ప్రాజెక్టుకు సోమవారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

స్టార్ట్‌పలకు ఊతమిచ్చేందుకు ప్రారంభించిన అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ (ఎయిమ్‌)ను 2028 మార్చి 31 దాకా పొడిగిస్తూ రూ.2750 కోట్లతో ప్రతిపాదించిన ‘ఎయిమ్‌ 2.0’కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘వన్‌ నేషన్‌ వన్‌ సబ్‌స్ర్కిప్షన్‌’ పథకానికి ఆమోదముద్ర వేసింది.  క్యాబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ మంత్రిమండలి తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి వివరించారు.

పాన్‌ 2.0 ప్రాజెక్టు కింద ఇప్పటికే జారీచేసిన పాన్‌కార్డులను క్యూఆర్‌ కోడ్‌తో ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు.  పాన్‌ను ‘కామన్‌ బిజినెస్‌ ఐడెంటిఫయర్‌’గా చేసేందుకు కేంద్రం ఈ ప్రాజెక్టును చేపట్టింది.  పాన్‌ కార్డులను ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేసి, క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వనున్నట్టు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. చాలాకాలంగా వాణిజ్యవర్గాలు కోరుతున్నట్టుగా పాన్‌, టాన్‌ సేవలను కలిపేయనున్నట్టు, పూర్తిగా పేపర్‌లెస్‌, ఆన్‌లైన్‌ పద్ధతిలో కొత్త పోర్టల్‌ ప్రారంభించనున్నట్టు చెప్పారు.

ఇక, ఎయిమ్‌ 2.0తో మెరుగైన ఉద్యోగాలు, సృజనాత్మక ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ వర్గాల అంచనా. అలాగే, ఈ పథకం కింద 30 ప్రాంతీయ నవకల్పన కేంద్రాలను, ‘లాంగ్వేజ్‌ ఇంక్లూజివ్‌ ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ (లిపి)’లను ఏర్పాటు చేయనుని వివరించారు.

2500 అటల్‌ టింకరింగ్‌ ల్యాబులను ఏర్పాటు చేస్తారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన జాతీయ మిషన్‌ విషయానికి వస్తే భూసారాన్ని మెరుగుపరచాల్సిన అవసరం, రసాయనాలు లేని ఆహారం అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ మిషన్‌కు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.

వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 15 వేల క్లస్టర్లలో 7.5 లక్షల హెక్టార్లలో ఈ మిషన్‌ కింద రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తారు. రైతులకు ఉపయోగపడే జీవామృతం, బీజామృతం వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు 10 వేల బయో ఇన్‌పుట్‌ రీసోర్స్‌ సెంటర్ల (బీఆర్సీల)ను ఏర్పాటు చేస్తారు.

ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 2000 నమూనా సాగు భూములను కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ వర్సిటీలు, రైతుల పొలాల్లో ఏర్పాటు చేస్తారు. ఆసక్తి ఉన్న రైతులకు.. ప్రకృతి వ్యవసాయంలో అనుభవజ్ఞులైన రైతులు, శిక్షకుల ద్వారా అక్కడ శిక్షణ ఇప్పిస్తారు.

పరిశోధనలను ప్రోత్సహించేందుకు గానూ రూ.6,000 కోట్లతో ‘వన్‌ నేషన్‌ వన్‌ సబ్‌స్క్రిప్సన్‌’ పథకానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పరిశోధకులకు ఒకే వేదికపై దేశంలోని అన్ని పరిశోధన పత్రాలు, జర్నళ్లు చదివేందుకు వీలు కలగనుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో రూ.3,689 కోట్లతో చేపట్టనున్న రెండు జల విద్యుదుత్పత్తి కేంద్రాలకూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *