ఇథనాల్, పెట్రోల్ కలిపితే ఇంజన్ కి నష్టమే లేదు : కేంద్రం క్లారిటీ
20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహనాలకు సురక్షితం కాదంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ భయాలన్నీ నిరాధారమైనవని పేర్కొంది. శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేవని పేర్కొంది.
ఇథనాల్ కలిపిన పెట్రోల్ తో ఎలాంటి ఇంజన్ సమస్యలు తలెత్తవని, ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది.
పెట్రోల్ తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా వుంటుందని, దానివల్ల మైలేజీలో తగ్గుదల ఉన్నా.. అది అతి స్వల్పమేనని పేర్కొంది. లక్ష కిలోమీటర్ల మేర సంప్రదాయ, ఇ20 ఇంధనం నింపిన వాహనాలకు జరిపిన పరీక్షలో పవర్, టార్క్, ఇంధన సామర్థ్యంలో గణనీయమైన తేడాలు కనిపించాయని తెలిపింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశీలనల్లో ఈ మిశ్రమ ఇంధనంతో ఇంజన్ దెబ్బతిన్న సంకేతాలు లేవని తెలిపింది.