పార్లమెంట్ భూమీ వక్ఫ్ దే అనేవారు : వక్ఫ్ చర్చ సందర్భంగా కిరణ్ రిజిజు

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చను చేపట్టారు. ఈ సమయంలో ప్రతిపక్షాలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలను తాము పరిగణనలోకి తీసుకున్నామని కిరణ్ రిజిజు అన్నారు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెప్పే ప్రమాదముందన్నారు.
అయితే ఈ బిల్లు గురించి విపక్షాలు లేనిపోని అసత్యాలను ప్రచారం చేశాయని కిరణ్ రిజిజు మండిపడ్డారు. తాము గనక 2014 లో అధికారంలోకి రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్, విమానాశ్రయ భూములను వక్ఫ్ బోర్డుకి అప్పజెప్పేదని దెప్పిపొడిచారు. అయితే ప్రధాని మోదీ పార్లమెంట్ ని వక్ఫ్ స్వాధీనం చేసుకోవడాన్ని ఆపేశారన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లులోని అంశాలను లేవనెత్తి ప్రజలను విపక్షాలు గందరగోళంలో పడేశాయన్నారు. 1954 లో తొలిసారి వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చిందని, అది అప్రజాస్వామికమని ఆనాడు ఎవ్వరూ చెప్పలేకపోయారని విమర్శించారు. మొత్తం 284 మంది ప్రతినిధులు,25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వక్ఫ్ బోర్డులు జేపీసీలో తమ వాదనలు వినిపించాయన్నారు. తాము బిల్లులో కొన్ని సానుకూల మార్పులు చేస్తే… కొందరు తమల్ని ప్రశ్నిస్తున్నారన్నారు. ఈ బిల్లుతో ముస్లింలకు వచ్చే నష్టమేమీ లేదని, ఈ విషయాన్ని కొందరు తెలుసుకోవాలని చురకలంటించారు. యూపీఏ గనక అధికారంలో వుంటే ఢిల్లీలోని కొన్ని కీలక స్థలాలు వక్ఫ్ సొంతమయ్యేవని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *