రాజకీయాలే నా వ్యాపకం కాదు.. నేనొక సాధువుని : సీఎం యోగి
రాజకీయాలు తనకు పూర్తి సమయ వ్యాపకం కాదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. తానొక సాధువును మాత్రమే అని గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవి రేసులో తాను ఉంటానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను యోగి వెల్లడించారు.
“యూపీ ప్రజలకు సేవ చేయడమే నా ప్రధాన కర్తవ్యం. నాకు పార్టీ అప్పగించిన బాధ్యత అదే. దాన్ని సరిగ్గా నిర్వర్తిస్తా” అని ఆయన పేర్కొన్నారు. “ఇంకా ఎంతకాలం పాటు రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నారు?” అని యోగిని ప్రశ్నించగా, “దానికి కూడా ఒక కాలపరిమితి ఉంటుంది” అని చెప్పారు.రాజకీయం, మతం అంశాలను వివరిస్తూ మతాన్ని ఓ ప్రదేశానికి పరిమితి చేశారని, రాజకీయాలను కొంత మంది చేతుల్లోకి వదిలేశారని, ఇక్కడే సమస్య ఉత్పన్నం అవుతోందని యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే, దాని వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆయన హెచ్చరించారు.
“మనం మతాన్ని ఒక స్థాయి వరకే పరిమితం చేస్తాం. రాజకీయాలను కొంత మందికే పరిమితం చేస్తాం. ఇందువల్లే సమస్య తలెత్తుతుంది. స్వార్థపూరిత రాజకీయాలతో సమస్యలు వస్తాయి. సువిశాల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మాకు మతం చెప్పేది కూడా అదే” అని సీఎం యోగి పేర్కొన్నారు.
“భారత ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం, మతంలో స్వార్థభావనకు తావు ఉండదు. ఆధ్యాత్మిక భావనను జనంలోకి తీసుకెళ్లేందుకు రాజకీయాలు కూడా ఒక వేదిక” అని ఆయన చెప్పారు. అందరి మంచి కోసం రాజకీయం చేస్తే, దాని వల్ల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని తెలిపారు. ఒకవేళ స్వప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటే, అప్పుడు అది కొత్త సవాళ్లను సృష్టిస్తుందని, ఒకవేళ ఎవరైనా ఉన్నత ఆశయాలకు అంకితం అయితే, అప్పుడు ప్రగతి ద్వారాలు తెరుచుకుంటాయని యోగి ఆదిత్యనాథ్ వివరించారు.