దీపావళి పర్వ దినానికి అంతర్జాతీయ గుర్తింపు.. యునెస్కో జాబితాలో చోటు
దీపావళి పండగకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగ చేరింది. ఢిల్లీ-ఎర్రకోట వద్ద నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భావోద్వేగ అంశమని ప్రకటించారు.
“దీపావళి అనేది భారతదేశం అంతటా విభిన్న వ్యక్తులు, సమాజాలు ఏటా జరుపుకునే కాంతి పండుగ. ఇది సంవత్సరంలో చివరి పంటను కొత్త సంవత్సరం, కొత్త సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. చంద్రామాన క్యాలెండర్ ఆధారంగా ఇది అక్టోబర్ లేదా నవంబర్లో అమావాస్య వస్తుంది. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి విజయాన్ని సూచించే ఆనందకరమైన సందర్భం” అని యునెస్కో తెలిపింది.
ఈ పండుగ సమయంలో ప్రజలు తమ ఇళ్లను, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసుకుని అందంగా అలంకరిస్తారు. ఇంకా ఇంటి ముందు దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి బాణసంచా పేల్చుతారు. అనంతరం అందరి శ్రేయస్సు, కొత్త ప్రారంభాల కోసం ప్రార్థనలు చేస్తారు’’ అని యునెస్కో వివరించింది.
యునెస్కో గుర్తింపు రావడం ఒక బాధ్యత అని, మనమందరం కచ్చితంగా ముందు తరాలకు అందించాలని పేర్కొన్నారు. దీపావళి అంటే రామరాజ్యానికి, సుపరిపాలనకు సంబంధించినదని పిల్లలకు తెలియాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎర్రకోట వద్ద యునెస్కో 20వ సదస్సు తొలిసారిగా భారత దేశంలో డిసెంబర్ 8 నుంచి 13 వరకు ఈ సమావేశం జరుగుతోంది. యునెస్కో గుర్తింపు కోసం 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలను కమిటీ పరిశీలిస్తోంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వందల మంది ప్రతినిధులు వచ్చారు.
ప్రస్తుతం భారత్లో 15 అంశాలు యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రస్తుతం భారత్లో 15 అంశాలు యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటిలో 2017లో కుంభమేళా, 2021లో కోల్కతా దుర్గా పూజ, 2023లో గుజరాత్లోని గర్భా నృత్యం, 2016లో యోగా, వేద పఠన సంప్రదాయం, 2008లో రామలీల – ఇతిహాసం ‘రామాయణం’ సాంప్రదాయ ప్రదర్శన ఉన్నాయి. వాటిని రక్షించుకోవాల్సి ఉందని యునెస్కో ప్రతినిధులు తెలిపారు.