తండ్రి పాత్ర పోషిస్తూ.. కన్యాదానం చేసిన మోహన్ భాగవత్
వారణాసి కేంద్రంగా అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా కన్యాదాన్ మహోత్సవ కార్యక్రమం జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రవర్ణ, దళిత, వెనుకబడిన వర్గాలకు చెందిన 125 మంది వధూ వరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామూహిక వివాహాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మోహన్ భాగవత్ తండ్రి పాత్ర పోషిస్తూ కన్యాదానం అన్న పవిత్ర ఆచారాన్ని నిర్వహించారు.
సోన్ భద్ర జిల్లాలోని జోగిదిహ గ్రామానికి చెందిన వనవాసి వధువు రాజ్ వంతి పాదాలను మోహన్ భాగవత్ కడిగారు. వనవాసి వరుడు అమన్ తో రాజ్ వంతి వివాహం జరిగింది. అమ్మాయి రాజ్ వంతిని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలని మోహన్ భాగవత్ సూచించారు.ఈ సందర్భంగా రాజ్ వంతిని తన కుమార్తెగా పేర్కొంటూ మోహన్ భాగవత్ వివాహ బహుమతిగా 501 రూపాయలిచ్చారు. ‘‘నా కుమార్తెను బాగా చూసుకో. ఆమెను ఎల్లప్పుడూ సంతోషంగా వుంచు’’ అని సూచించారు.

కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిగింది. సామాజిక సమరసత అన్న భావన ఇక్కడ వెల్లివిరిసింది. కేవలం ఓ ఉత్సవం లాగా కాకుండా భారతీయ సాంస్కృతిక విలువలకు శక్తిమంతమైన ప్రతిబింబంగా భాసిల్లింది. కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం, సమాజంలోని విలువలను పునరుద్ధరించే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.
ఈ ప్రత్యేకమైన వేడుకను యూపీకి చెందిన సీనియర్ ఆరెస్సెస్ కార్యకర్త వీరేంద్ర జైస్వాల్ నిర్వహించారు. తన చిన్న కుమారుడు విభావ్ వివాహంతో పాటు 101 మంది పేద ఆడపిల్లల వివాహం కూడా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే తన ప్రతిజ్ఞను నెరవేర్చారు.

ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక కాదని, రెండు కుటుంబాల కలయిక అని అన్నారు. ఈ కుటుంబాల కలయిక ద్వారా సమాజాన్ని బలోపేతం చేయడం అని వివరించారు. కన్యాదాన సమయంలో సంరక్షకులుగా బాధ్యతలు తీసుకున్న వారు నూతన వధూ వరులతో సంబంధాలు కొనసాగించాలని సూచించారు. సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు వారిని కలుసుకోవాలని, వారికి నైతిక మద్దతు, మార్గదర్శనం చేయాలన్నారు.