భారత్ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరీక్ష సక్సెస్
భారత రక్షణ రంగం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేందుకు నిరంతరం అత్యాధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమ్ములపొదిలోకి చేర్చుకుంటోంది. తాజాగా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒడిశా తీరంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థ అయిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా X వేదికగా ప్రకటించారు.
‘‘సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను 23 వ తేదీ అర్ధరాత్రి ఒడిశా తీరం నుంచి డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఇది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. దీనిలో భారత్ లో అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్ డ్ వెరీ షార్ట్ రేంజి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైల్స్, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ వున్నాయి. IADWS ను విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు DRDO ను, సైనిక దళాలను నేను అభినందిస్తున్నా. ఈ ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలియజేసింది. శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది బలోపేతం చేస్తుంది’’ అని రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.