కల్నల్ సోఫియా ఇంటిపై దాడి అంటూ RSSపై తప్పుడు ప్రచారం… ఫేక్ అని తేల్చిన పోలీసులు

భారత సమైక్యత కోసం పాటుపడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్న విచ్ఛిన్నకర శక్తులు ఎలాగైనా సంఘ్‌ని అప్రతిష్టపాలు చెయ్యాలని నానా పాట్లు పడుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నాయి. తాజాగా, పాక్‌పై భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్‌లో అత్యంత కీలకపాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషీ ఇంటిపై సంఘ్ కార్యకర్తలు దాడి చేసి, కర్ణాటకలోని బెళగావి జిల్లా గోకాక్‌లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను గాయపరిచారంటూ సంబంధం లేని చిత్రాలపై సోఫియా ఫొటో వేసి, ఇష్టానుసారం రాసిపడేసి ఎక్స్ ఖాతాలో @uddinanis867 హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేశారు. ట్వీట్‌లో RSSకి వ్యతిరేకంగా రకరకాల హ్యాష్ టాగ్స్ పెట్టి వదిలారు.
వెంటనే రంగంలోకి దిగిన బెళగావి పోలీసులు అత్యంత వేగంగా ఈ ట్వీట్‌పై దర్యాప్తు చేశారు. ఆర్ఎస్ఎస్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన ఈ ట్వీట్, దానిలో ఉన్న ఫొటోలు, రాతలు అంతా తప్పుడు సమాచారం, పూర్తిగా ఫేక్ అని తేల్చారు. మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చిన జిల్లా ఎస్పీ భీమశంకర్ ఈ ట్వీట్ పోస్ట్ చేసిన వారిపై దర్యాప్తు చేసి పట్టుకుంటామన్నారు. “Anis Uddin” పేరిట వేసిన ఈ పోస్ట్ లొకేషన్ కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ అని తెలుస్తోంది. 405 హ్యాండిల్స్‌ని ఫాలో అవుతున్న ఈ ప్రొపైల్‌కి 31 మంది ఫాలోవర్లున్నారు. ఇందులోని పోస్ట్‌లు అన్నీ పాకిస్తాన్‌కి మద్దతుగా ఉన్నవే… ఈ ఎక్స్ అకౌంట్ కవర్ పేజీలో పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ మహ్మదాలీ జిన్నా, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బొమ్మలున్నాయి. ఆపరేషన్ సిందూర్‌కి సంబంధించి మే 7న భారత దళాలు పాకిస్తాన్, పీఓకేల్లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన సాహసోపేతమైన దాడుల గురించి మీడియాకి సమాచారమిచ్చిన బృందంలో కల్నల్ సోఫియా ఖురేషీ ఒకరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *