5 లక్షలకు రుణం పెరగడంతో… కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు
కేంద్రం తన తాజా బడ్జెట్ లో కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ సౌకర్యాన్ని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడంతో రైతులు క్రెడిట్ కార్డుల వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు. కార్డులు కావాలంటూ బ్యాంకుల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. తమకు కూడా క్రెడిట్ కార్డులు కావాలంటూ రైతులు అధిక సంఖ్యలో బ్యాంకులకు వస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్డులకు 5 ఏళ్ల వరకూ కాలపరిమితి వుండటం, ఇప్పుడు 5 లక్షల వరకూ రుణాన్ని పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు ఉత్సాహం చూపుతున్నారు.
ఈ అయిదేళ్లలో యేటా కార్డు పరిమితిని దృష్టిలో పెట్టుకొని గతంలో 3 లక్షలు..ఇప్పటి నుంచి 5 లక్షల వరకు రుణం పొందవచ్చు. బ్యాంకు రుణాలు మంజూరు చేసిన తర్వాత కేసీసీని ఏటీఎం మాదిరిగా వినియోగించుకోవచ్చు. దశల వారీగా నగదును విత్ డ్రా చేసుకునే సౌలభ్యం వుంటుంది. సాధారణంగా వడ్డీ రేటు కనిష్టంగా 7 నుంచి గరిష్టంగా 14 వరకు వుంటుంది. మొదటి దఫా 7 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మొత్తాన్నిసకాలంలో చెల్లించి రెన్యువల్ చేసుకుంటే నాలుగు శాతం వర్తిస్తుంది. మిగిలిన మూడు శాతం వడ్డీని కేంద్రం బ్యాంకులకు ఇస్తుంది. ఇప్పటి వరకైతే పంట రుణాల కోసం రైతులు యేటా బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకునే సంప్రదాయం వుంది. కానీ కిసాన్ క్రెడిట్ కార్డులు వున్న వారు వాటి ఆధారంగా నేరుగా రుణాలు పొందే సౌలభ్యం వుంది. అయితే రుణం ఇచ్చే ముందు రైతు ఆదాయం, ఎంత భూమి వుంది? గతంలో రుణాలు తీసుకున్న వాటిని బేరీజు వేసుకొని, రుణం మంజూరు చేస్తాయి.
కార్డులను ఎలా పొందాలంటే…
కిసాన్ క్రెడిట్ కార్డులను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లోనూ తీసుకోవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
18 నుంచి 75 వయస్సు లోపు వున్న వారు అర్హులు.
వ్యవసాయ భూమి వున్న రైతులకు పంట రుణాలు, వ్యవసాయ మౌలిక వసతులు, యంత్ర పరికరాల కోసం రుణాలు ఇస్తారు.
కోళ్లు ,గొర్రెలు, పశువులు, చేపలు, కుందేళ్ల వంటి పెంపకం దారులు కూడా వీటిని పొందవచ్చు.
కార్డు వున్న వారికి బీమా సౌకర్యం కూడా అందుబాటులో వుంది.
అయితే.. బ్యాంకు అడిగిన డాక్యుమెంట్లను మాత్రం కచ్చితంగా సమర్పించాలి.