ఐదు లక్షల మందితో కలకత్తాలో ‘‘సామూహిక గీతా పారాయణం’’..
ఈ సామూహిక గీతా పారాయణ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జరిగిన అతిపెద్ద ధార్మిక కార్యక్రమం, గీతా పారాయణ కార్యక్రమం ఇదే అని రికార్డు సృష్టించింది. బెంగాల్ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని, సామాజిక సమరసతను ప్రపంచానికి చాటి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు వివరించారు. హిందువులు అందరూ తమ తమ ఇళ్లల్లో గీతా పారాయణం చేస్తుంటారు కానీ.. సామూహికంగా పారాయణం చేయడం ద్వారా లోక కల్యాణం జరుగుతుందని, సామూహిక శక్తి కూడా పెరుగుతుందని, శాంతి, శ్రేయస్సు కలుగుతుందని సాధు సంతులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాగేశ్వర్ బాబా మాట్లాడుతూ.. హిందువులు ఐక్యమైతే, భారతదేశం హిందూ దేశంగా మారకుండా ఎవరూ ఆపలేరని ప్రకటించారు. ఈ దేశం రఘువీరునికి సంబంధించినదని, బాబర్ కి సంబంధించింది కాదని తేల్చి చెప్పారు. హిందువులు ఐక్యంగా వుండి, ప్రతి గ్రామంలో కాషాయ జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం బెంగాల్ లో కాషాయ జెండాలు ఎగురుతున్నాయని అందుకు ఆనందంగా వుందన్నారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరియు కచ్ నుండి సుందర్బన్ వరకు హిందూ రాష్ట్ర ప్రతిధ్వని వినిపించాలని సాధ్వి రీతంబర పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా లక్షలాది మంది కలిసి సామూహిక గీతా పారాయణ చేశారు. మరో వైపు గవర్నర్ ఆనంద బోస్ మాట్లాడుతూ మతపరమైన దురహంకారాన్ని అంతం చేయడానికి బెంగాల్ ప్రజలు సిద్ధంగా వున్నారని అన్నారు. ఈ సందర్భంగా ముర్షిదాబాద్ లో జరిగిన ఓ ఘటనను ఉటంకించారు. అలాగే అవినీతి అంతం గురించి కూడా మాట్లాడారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అనే భగవద్గీత శ్లోకాన్ని ప్రస్తావిస్తూ, ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని అంతం చేయాలనే సంకల్పం ఎప్పుడూ ఉంటుందని వివరించారు.