సుసంపన్నంగా సాగిన గోల్కొండ సాహితీ మహోత్సవం
‘హైదరబాద్ విముక్తి పోరాటం’ ప్రధానాం శంగా గోల్కొండ సాహితీ మహోత్సవం, 2022 భాగ్యనగర్లోని పత్తర్ గట్టి అగర్వాల్ కళాశాలలో డిసెంబర్ 11న సుసంపన్నంగా సాగింది. హైదరాబాద్ విముక్తి పోరాట అమృతోత్సవాలను పురస్కరించుకుని సమాచారభారతి, సంస్కార భారతి, ఇతిహాస సంకలన సమితి తదితర సంస్థల ఆధ్వర్యంలో గోల్కొండ సాహితీ మహోత్సవపు ఈ ద్వితీయ సంచిక హింది భాషా మాధ్యమంలో సాగడం విశేషం.
ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన ప్రముఖ విద్యావేత్త, సాహిత్యవేత్త ప్రొ.ఆనందరాజ్ వర్మ హైదరబాద్ ముక్తి సంగ్రామంలో అనేకమంది పాల్గొన్నారని, వారి గురించి అందరూ, ముఖ్యంగా యువత తప్పక తెలుసుకోవాలని అన్నారు. రాజా రామచంద్ర రావు జాధవ్, రాజా మహిపత్ రామ్ సెహగల్, పండిత్ గంగారాం, పండిత్ గోవిందలాల్ వ్యాస్ వంటివారి గురించి చరిత్ర పుస్తకాలలో కనిపించదని, ఇది దురదృష్టకరమైన విషయమని అన్నారు. ఆ తరువాత మాట్లాడినా వంశతిలక్ నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కొన్ని విశేషాలను వివరిం చారు. ప్రధాన వక్త ప్రశాంత్ పోల్ మన దేశ చరిత్రలో మరుగున పడిపోయిన అనేకమంది స్వాతంత్య్ర వీరుల గురించి అందరికీ తెలియ జెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలోనే పలు పుస్తకాల ఆవిష్కరణ కూడా జరిగింది. డా. శ్రీరంగ్ గోడ్బోలే వ్రాసిన ‘భాగానగర్ నిశస్త్ర ప్రతిరోధ్’ తోపాటు ఆ పుస్తకపు తెలుగు అనువాదం ‘హైదరబాద్ నిరాయుధ ప్రతిఘటన’, ప్రశాంత్ పోల్ వ్రాసిన ‘వినాశ్ పర్వ్’, కందకుర్తి ఆనంద్ తెలుగులో వ్రాసిన ‘ఆధ్యాత్మిక, క్షాత్ర తేజం సంత్ సేవలాల్ మహరాజ్’ అనే పుస్తకాలు కూడా విడుదలచేశారు.
ఆ తరువాత రెండవ సమావేశంలో ‘ముక్తి సంగ్రామంలో అజ్ఞాత వీరులు’ అనే అంశాన్ని గురించి ప్రముఖ రచయితలు డా. విద్యా దేవధర్, శ్రీ మహాదేవయ్య, డా. రాహుల్ శాస్త్రి మాట్లాడారు. హైదరబాద్ లో సాగిన ముక్తి పోరాటాన్ని గురించి డా.దేవధర్, డా.రాహుల్ శాస్త్రి, కర్నాటకలో పోరు గురించి మహాదేవయ్యలు వివరించారు.
మూడవ సమావేశంలో ‘కథలు, గీతాలు సంప్రదాయాల సంరక్షణ, ముక్తి సంగ్రామంలో వాటి పాత్ర’ అనే అంశంపై మరాఠ్వాడా విశ్వవిద్యాల యానికి చెందిన డా. జోగింద్ర సింగ్ బిసేన్, ప్రొ.సి.సంజీవ, శ్రీ రాకా సుధాకరరావు మాట్లాడారు.
తరువాత జరిగిన ముగింపు కార్యక్రమంలో పాంచజన్య హిందీ వారపత్రిక సంపాదకులు శ్రీ హితేష్ శంకర్ పాల్గొన్నారు. మన దేశపు సంస్కృతిని అణచి ఉంచడానికి, చరిత్రను వక్రీకరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని, జరుగుతున్నాయని, వాటిని అడ్డుకో వలసిన అవసరం ఉందని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన గోల్కొండ సాహితి మహోత్సవ కన్వీనర్ శ్రీ వల్లీశ్వర్ మాట్లాడుతూ సాహిత్యం, పాటలు, కవిత్వం మనలో సంస్కారాన్ని కలిగించి, ఆనందాన్ని కూడా అందిస్తాయని అన్నారు.