దేశ రక్షణ హిందూ ధర్మంతోనే : గోవింద దేవగిరి స్వామీజీ
హిందుత్వ శంఖనాదాన్ని చూడాలంటే విజయవాడను చూసి నేర్చుకోవాలని, హిందూ జాగరణ విజయవాడ కేంద్రంగా అయ్యిందని అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి పూజ్యశ్రీ గోవింద దేవగిరి స్వామీజీ అన్నారు.హిందూ జాగరణ అనేది ధర్మ రక్షణ, సంస్కృతి రక్షణ కోసం అని పేర్కొన్నారు. ఈ ధర్మానలు రక్షించుకోవడానికి విజయవాడ కేంద్రంగా హిందువులందరూ ఇక్కడికి వచ్చారన్నారు. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్ తో దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా మొదటగా విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వహిందూ పరిషత్ ఆదివారం హైందవ శంఖారావం నిర్వహించింది.
ఈ సందర్భంగా పూజ్య శ్రీ గోవింద దేవగిరి స్వామీజీ మాట్లాడుతూ కేవలం భారత దేశమే కాదు.. సంపూర్ణ విశ్వం సుభిక్షంగా వుండాలంటే భారత్ దేశ రక్షణ అత్యావశ్యకమన్నారు.భారత దేశ రక్షణ హిందూ ధర్మంతోనే ముడిపడి వుందన్నారు.అప్పుడే విశ్వకల్యాణం జరుగుతుందన్నారు. ఇందుకోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ లక్ష్యాలను చేరుకుంటే విశ్వాన్ని జాగృతం చేయడం సులభమన్నారు.హిందువులు ఏ దిశగా తమ ప్రయత్నాలు, సాధన చేయాలో శివాజీ చేసి చూపించారన్నారు.
శూరత్వం, వీరత్వంతో పాటు సాధు సత్పురుషత్వం కూడా శివాజీలో కనిపిస్తాయన్నారు.అంతేకాకుండా చతురతతో కూడా పాలన సాగిందన్నారు. ఈ లక్షణాలను శివాజీ తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోలేదని, విశ్వ కల్యాణం కోసం ఉపయోగించారని గుర్తు చేశారు. ఈ జాతికి ప్రేరణను నింపిన ప్రేరణా స్రోతస్సు శివాజీ అని అన్నారు.ఆయన జీవితం మొత్తం లోక కల్యాణం కోసమే అని అన్నారు. హిందూ సమాజానికి శాస్త్రాలు, వేదాలు, సాధువులు, గోమాత, తీర్థయాత్ర, మందిరాలు హైందవ సమాజానికి నిత్యం ప్రేరణను అందిస్తుంటాయన్నారు. మందిరాలంటే కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదని, భగవంతుని నివాసాలన్నారు. అందులో భగవంతుడ్ని జ్యోతి రూపంలో ప్రతిష్ఠ చేసుకుంటామని, అందుకే దేవాలయాలను హైందవ సమాజం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే వాటిని దేవ ఆలయాలని అంటామన్నారు. దేవాలయాలు మనకు ప్రేరణను కలిగిస్తాయని, మనిషిలోని అంతర్గత జ్యోతిని వెలిగిస్తాయన్నారు. ఈ విశాల సమూహం దేవాలయాల రక్షణకు పాటుపడాలన్నారు.
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠను యావత్ హిందూ సమాజం చేపట్టిందని స్వామీజీ పేర్కొన్నారు. అక్కడ పూజా వ్యవహారాలు, నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏ ప్రభుత్వం ఒత్తిడి లేకుండానే అయోధ్యలో అత్యంత శ్రద్ధతో, సంప్రదాయాలతో నడుపుతున్నామన్నారు. నిధుల విషయంలో, పూజల విషయంలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు.
ఇంకా దేవాలయ నిర్మాణం కొనసాగుతోందన్నారు. రాబోయే వార్షికోత్సవాలను తిథి ప్రకారం పుష్య శుక్ల ద్వాదశ నాడు జరుపుతున్నామని, దీనిని ప్రతిష్ఠా ద్వాదశి పేరుతో జరుపుకుంటున్నామన్నారు. అయోధ్యలో ఏ విధంగానైతే రామాలయాన్ని స్వతంత్రంగా, ఆదర్శంగా నిలుపుకుంటున్నామో.. మిగిలిన దేవాలయాలను కూడా అదే విధంగా స్వతంత్రంగా, ఆదర్శంగా నడుపుకోవాలని స్వామీజీ పిలుపునిచ్చారు.