కలబుర్గి వేదికగా ”భారతీయ సంస్కృతి ఉత్సవం”

దేశ ప్రగతి, సుస్థిరత, శాంతి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6 వరకు కర్ణాటకలోని కలబురగి జిల్లా సేడంలో భారతీయ సంస్కృతి ఉత్సవం-7 నిర్వహిస్తున్నట్లు భారత్‌ వికాస్‌ సంఘం వ్యవస్థాపకుడు కేఎన్‌ గోవిందాచార్య తెలిపారు. ఉత్సవం గోడపత్రికను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించారు. ‘‘దేశంలో 15 వేల నదులకు గానూ 4,700 నదులు ప్రపంచపటంలో కనిపించడంలేదు. అటవీ విస్తీర్ణం 15 శాతానికి పడిపోయింది. 2030లోపు నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే తర్వాత ఏమి చేసినా ప్రయోజనం ఉండదు. ఈ క్రమంలో ప్రపంచమంతా ఒక్కటై గ్లోబల్‌ వార్మింగ్, పర్యావరణ మార్పులపై ఆలోచింపజేసేలా తొమ్మిది రోజులు 9 సమ్మేళనాలు ఉంటాయి’’ అని వివరించారు.

 

సమాజ బాగు కోసం ఆలోచించి, శ్రమించే వాళ్లందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశమని ఏకలవ్య ఫౌండేషన్‌ ఛైర్మన్, భారతీయ సంస్కృతి ఉత్సవ్‌ మార్గదర్శకుడు పి.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఉత్సవాలకు హాజరయ్యే సందర్శకులకు ఉచితంగా బస, భోజన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరింత సమాచారం కోసం 94407 88282 నంబరులో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రివల్యూషన్‌ వ్యవస్థాపకులు లీలా లక్ష్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *