సివిల్స్ అభ్యర్థులకు, ఇతర విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్న గ్రామ పంచాయతీ
పంజాబ్ లోని అక్రి గ్రామ పంచాయతీ దేశంలోని ఇతర గ్రామ పంచాయతీలకు ఆదర్శమైంది. తమ గ్రామ పంచాయతీ పరిధిలో సివిల్ సర్వీసులకి ప్రిపేర్ అవుతున్న వారికి, సాయుధ బలగాల్లోకి వెళ్లి, దేశానికి సేవ చేయాలనుకున్న వారికి లేదా ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ చదువుతున్న వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించింది. ఇలాంటి అభ్యర్థులంతా గ్రామ పంచాయతీకి వచ్చి, తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ అక్రి గ్రామ పంచాయతీ పరిధిలో 800 మంది జనాభా వుంది. ఈ గ్రామం పాటియాలాలోని ఘనౌర్ బ్లాక్ లో వుంది. ఈ గ్రామంలో మొత్తం 562 మంది ఓటర్లు వున్నారు. కొన్ని రోజుల క్రిందటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి పలువురు కొత్తవారు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆ సభ్యులందరూ తొలి సారిగా సమావేశమై, గ్రామస్థులందరి సమక్షంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కీలక నిర్ణయాల్లో పైన పేర్కొన్నది ఓ నిర్ణయమని ఓ సభ్యుడు తెలిపారు. ఈ పంచాయతీ విశేషం ఏమిటంటే సర్పంచ్ తో సహా… ఇతర సభ్యులందరూ 40 ఏళ్ల లోపువారే.
అక్రి గ్రామ సర్పంచ్ 38 ఏళ్ల జస్వీందర్ సింగ్ మాట్లాడుతూ, డిసెంబర్ 22 న జరిగిన పంచాయితీ సమావేశంలో డాక్టర్, ఇంజనీర్ లేదా చేరబోయే ఐఎఎస్ అభ్యర్థులు మరియు ఇతరులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించామన తెలిపారు. అర్హత వున్న వారికే సాయం చేస్తామన్నారు. ఇలా చేయడం ద్వారా వారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, లక్ష్యం వైపు దృష్టి సారిస్తారని.. ఇలా లక్ష్యం సాధించిన తర్వాత వారు గ్రామంలోని ఇతరులకు సాయం చేస్తారని, ఇదే తమ లక్ష్యమని సర్పంచి తెలిపారు. ఈ యువకులను చూసి, ఇతర యువకులు ప్రేరణ పొందుతారని పేర్కొన్నారు.
తమ గ్రామంలో చాలా మంది పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నవారు వున్నారని, సివిల్స్, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్… ఇలా లక్ష్యాలు పెట్టుకున్నారని, వారిలో సగం మంది ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారన్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న వారూ వున్నారన్నారు. దీంతో ఇలాంటి వారందరికీ తమ తీర్మానం బాగా ఉపకరిస్తుందని సర్పంచ్ తెలిపారు.
గత సంవత్సరం, గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు వివిధ పరీక్షలలో ప్రథమ స్థానంలో నిలిచారు. వారిలో ఐదుగురు నిరుపేద కుటుంబాలకు చెందినవారేనని తెలిపారు. ఇప్పుడు అలాంటి తెలివైన విద్యార్థులు వారి కలలను వెంటాడగలుగుతారు మరియు పోటీ పరీక్షలలో పోటీ పడగలరని పేర్కొన్నారు.చదువుతోపాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడాపోటీల్లో పాల్గొని గ్రామానికి పేరు తెచ్చే వారికి ఆర్థిక సహాయం, అదనపు సౌకర్యాలు కల్పిస్తామని జస్వీందర్ సింగ్ తెలిపారు.