సేంద్రీయ వ్యవసాయంతో గ్లోబల్ వార్మింగ్ కి ముకుతాడు : లోక్ మంథన్ లో గుజరాత్ గవర్నర్
భాగ్యనగరం వేదికగా లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 అద్భుతంగా జరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు, అతిథులు, మేధావులు, ఆలోచనలు, మంథనం.. ఇలా వేడుకగా జరుగుతోంది. మొదటి రోజు ఈ మంథన్ ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రసంగం కూడా చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ప్రసంగించారు. వీరితో పాటు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆచార్య దేవవ్రత్ మాట్లాడుతూ ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం ఈ సృష్టి ఆవిర్భావం రమారమీగానే సూచిస్తుంది కానీ, మన భారతీయ శాస్త్రీయ విజ్ఞానం కచ్చితమైన ఆధారాలతో లెక్కలతో సహా వివరిస్తుందని తేలిపారు.
మన వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని సంవత్సరాలు తరువాత వచ్చే సూర్యుగ్రహణం, చంద్రగ్రహణం కాలాలను, సమయాన్ని ముందుగానే సూచిస్తుంది అని చెప్పారు.కృత్రిమమైన ఎరువులు మరియు రసాయనాలు ధీర్ఘకాలం వాడటం వలన నేల సారం తగ్గి నేల నాణ్యత లోపించింది అని, అది పర్యావరణానికి హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై దేశవ్యాప్త చర్చ జరగాలన్నారు. దానితోపాటు నేలల్లో ఖనిజాలు లోపించి నేల నిస్సారం అయ్యి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయి , వర్షపు నీటిని ఒడిసిపట్టే సామర్థ్యాన్ని కోల్పోయిందని వివరించారు.అలా జరగకుండా ఉండాలంటే రైతులు తప్పనిసరిగా తమ భూమిని కాపాడుకోవడానికి మట్టిని సారవంతంగా తయారు చేయాలని సూచించారు. ఇందుకోసం సేంద్రీయ ఎరువులను ఉపయోగించాలని సూచించారు. అలాగే సేంద్రీయ వ్యవసాయం గ్లోబల్ వార్మింగ్ ని నివారించడానికి కూడా తోడ్పడుతుందన్నారు.