గురు పౌర్ణమి
ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ జరుపుకొంటారు.
వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాస రూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే
వాసిష్ఠాయ నమోనమః
లోకానికి అంతటికి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి ఆయన జన్మతిథి అయిన ఆషాడశుద్ధ పౌర్ణమిని గురుపూర్ణిమగా జరుపుకోవటం సాంప్రదాయం. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని త్రుంచి మానవతా విలువలు, సద్గుణ సంపన్నత ఎలా పొందాలో నేర్పుతాడు. గురువు లోకంలో ఎలా జీవించాలో తెలియ జేస్తాడు. ‘‘గు’’ కారో అంధ కారస్య ‘‘రు’’ కారో తన్నిరోధకస్యÑ అంటే గు అంటే చీకటి రు అంటే పారద్రోలేవాడు. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు.
జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులను ఈ రోజు స్మరించి, ఆరాధించి కృతజ్ఞతలు తెలియ జేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యలను బోధించే గురుదర్శనానికి, స్మరణకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది.
ప్రాతః కాలంలో సూర్యుడు తన సప్త అశ్వరథంపై అధిరోహించి సమస్త అంధకారాన్ని తొలగిస్తాడు. సూర్యుడు రథంపై ఉండే అరుణ పతాకమే భగవాధ్వజం. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ులో భగవాధ్వజాన్నే గురువుగా స్వీకరించటం జరిగింది. గురుపూజ రోజు స్వయంసేవకులు భగవాధ్వజచ్చాయలో తను మన, ధన పూర్వకంగా సమర్పణ చేస్తారు.