రామాయణాన్ని కించపరిచిన ఐఐటీ బాంబే విద్యార్థులు.. ఒక్కొక్కరికి 1.2 లక్షల ఫైన్ వేసిన యాజమాన్యం

భారత దేశంలోనే జీవిస్తూ… భారత దేశ ప్రజలకు పరమ పవిత్రమైన గ్రంథాలను, మహా పురుషులను అవమానపరుస్తూ, కించపరుస్తూ.. కామెంట్స్‌ చేయడం, పోస్టింగ్‌ చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది. ఇలా చేయాలంటూ కొన్ని విదేశీ శక్తులు ఇక్కడి విద్యార్థులను, రాజకీయ నేతలను, సోకాల్డ్‌ ఉద్యమకారులను పురమాయించారు. దీంతో వారు హిందువుల దేవుళ్లను, గ్రంథాలను కించపరుస్తూ కామెంట్స్‌ చేస్తుంటారు. ఇంకా కొందరికి వలసవాద బుద్ధి పోలేదు. తాజాగా… ఇలాంటి సంఘటనే ఒకటి ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ బాంబే విద్యా సంస్థలో జరిగింది. నాటకం పేరుతో పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేసేలా, కించపరిచేలా ఓ నాటకం వేశారు. ఇందులో రామాయణ పాత్రలను కించపరిచారు.

ఈ యేడాది మార్చి 31 న ఐఐటీ బాంబే వార్షికోత్సవం సందర్భంగా ‘‘ఆర్ట్స్‌ ఫెస్టివల్‌’’ పేరుతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో కొందరు విద్యార్థులు ‘‘రాహోవన్‌’’ పేరుతో ఓ నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణం ఇతివృత్తంగా ఈ నాటకం సాగింది. అయితే ఇందులో రామాయణాన్ని, ఆ సన్నివేశాలను కించపరిచినట్లు కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో రామాయణాన్ని కించపరిచారని, సంప్రదాయాలను అపహాస్యం చేశారంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో కాలేజీ యాజమాన్యం క్రమశిక్షణా కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఘటనపై దర్యాప్తు కూడా జరిపింది. ఈ దర్యాప్తు తర్వాతే విద్యార్థులపై చర్యలకు ఉపక్రమించింది ఐఐటీ బాంబే యాజమాన్యం. ఒక్కో విద్యార్థికి 1.20 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించింది. మరో నలుగురు విద్యార్థులకు 40 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది.ఈ చర్యలతో పాటు క్యాంపస్‌లో విద్యార్థులకిచ్చే ‘‘జింఖానా’’ అవార్డులను ఆ విద్యార్థులకు ఇవ్వమని, జూనియర్‌ విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నామని యాజమాన్యం ప్రకటించింది. ఇకపై క్యాంపస్‌ ఆవరణలో ఏ మత విశ్వాసాల్ని కూడా కించపరచకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *