భారత్ ప్రతీకారం ప్రారంభం… ‘‘ఆపరేషన్ సింధూర్’’.. 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ పై ప్రతీకార చర్యలు చేపట్టింది. అందరూ అనుకున్నదే జరిగి తీరుతుందని, మోదీపై విశ్వాసం వుంచాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన రెండు రోజులకే అత్యంత కీలక పరిణామం జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం అత్యంత మెరుపు దాడులు చేసింది.
భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లో ని ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను, వారికి ఉపయోగపడే ఇతర సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసేసింది. పూర్తి కచ్చితత్వంతోనే ఈ దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
‘‘ భారత రక్షణ దళాలు ఆపరేషన్ సింధూర్ ను చేపట్టాయి. పీఓకే, జమ్మూ కశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తూ.. ధ్వంసం చేశారు. పూర్తి కచ్చితత్వంతోనే జరిగాయి. అయితే పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. అత్యంత సంయమనాన్ని ప్రదర్శిస్తూనే భారత సైన్యం లక్ష్యాలను ఎంపిక చేసి, అమలు చేసింది. అత్యంత పాశవికమైన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఈ ఆపరేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం బ్రీఫ్ చేస్తాము’’అని రక్షణ శాఖ ప్రకటించింది.