భారత్ లో తొలి స్వదేశీ మైక్రోచిప్ విక్రమ్ 3201 ఆవిష్కరణ..దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘విక్రమ్ 3201’ అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్ను ఆవిష్కరించారు. ఇది దేశ సెమీకండక్టర్ల టెక్నాలజీలో ఓ మైలురాయిగా నిలిచింది. ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సమావేశాలో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ మైక్రో చిప్ ను ప్రధాని మోదీకి బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, ఈ మైక్రోచిప్లను ‘డిజిటల్ డైమండ్స్’గా అభివర్ణిస్తూ, భవిష్యత్ ప్రపంచం చిప్ల ఆధారంగానే నడుస్తుందని స్పష్టం చేశారు.
విక్రమ్ 3201’ ప్రాసెసర్ను ప్రత్యేకంగా అంతరిక్ష ప్రయోగాల కోసం రూపొందించారు. ఇది అంతరిక్షంలోని అత్యంత కఠినమైన వాతావరణాన్ని, అంటే తీవ్రమైన ఉష్ణోగ్రతలను (-55°C నుంచి +125°C వరకు), అధిక రేడియేషన్ను సైతం తట్టుకోగలదు. అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాల్లో అత్యంత విశ్వసనీయమైన ‘ఆడా’ ప్రోగ్రామింగ్ భాషకు ఇది సపోర్ట్ చేస్తుంది. ఇదివరకే ఉన్న 16-బిట్ ‘విక్రమ్ 1601’ చిప్కు ఇది అధునాతన వెర్షన్. ఈ చిప్తో పాటు అవసరమైన సాఫ్ట్వేర్ టూల్స్ను కూడా ఇస్రోనే అభివృద్ధి చేయడం విశేషం. దీనివల్ల విదేశీ ఎలక్ట్రానిక్స్పై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఈ ప్రాసెసర్ ను తయారీ మొదలుపెట్టింది దీన్ని పీఎస్ఎల్వీ సీ60 మిషన్ లో వినియోగించారు. ఈ మైక్రోప్రాసెసర్ కేవలం అంతరిక్ష ప్రయోగాలకే పరిమితం కాదు. రక్షణ, ఏరోస్పేస్, ఆటోమోటివ్ వంటి కీలక రంగాల్లో కూడా దీనిని వినియోగించుకోవచ్చు. ఈ ఆవిష్కరణతో భారత్ సెమీకండక్టర్ల తయారీలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందనే చెప్పవచ్చు.

ఈ చిప్ను ఇస్రోకి చెందిన సెమీ కండక్టర్ లాబొరేటరీ (SCL)… చండీగఢ్లో అభివృద్ధి చేసింది. దీనిని పంజాబ్… మొహాలీలోని SCLకి చెందిన 180nm CMOS సౌకర్యంలో తయారుచేశారు. విక్రమ్ 3201 అనే ఈ చిప్ అంతరిక్ష ప్రయోగ వాహనాల్లో… కఠిన పరిస్థితుల్లో పనిచేయడానికి రూపొందించినది. దీన్ని PSLV-C60 మిషన్లో విజయవంతంగా పరీక్షించారు. అందువల్ల భవిష్యత్ అంతరిక్ష మిషన్లకు దీన్ని ధైర్యంగా వాడేందుకు వీలు కలిగింది.