పెట్టుబడిదారులతో వక్ఫ్ దుర్వినియోగం : ఇంద్రేశ్ కుమార్

వక్ఫ్ బోర్డు విషయంలో రాజకీయాలు చేయవద్దని ఆరెస్సెస్ ప్రచారక్, ముస్లిం విచార్ మంచ్ మార్గదర్శకులు ఇంద్రేష్ కుమార్ సూచించారు. పేద ముస్లింలను ఆదుకునేందుకు వక్ఫ్ బోర్డ్ ఏర్పాటైందని, కానీ… ఆ బోర్డు వల్ల పేద ముస్లింలకు ఎలాంటి ప్రయోజనమూ కలగలేదన్నారు. వక్ఫ్ బోర్డును కొందరు పెట్టుబడిదారులు, పలుకుబడి వున్న వారు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు అని అనే ముందు, దానిపై చర్చించే వారు ముందుగా అందులోని ప్రతి అంశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.
వక్ఫ్ బోర్డు విషయంలో పేద ముస్లింలకు ఎలాంటి అవగాహన లేదని, దానికి సంబంధించిన సమాచారమూ లేదని, దీనిని కొందరు ముస్లిం పెట్టుబడిదారులు, కబ్జాదారులు గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం ఆక్రమణదారులు కొందరు రాజకీయ నేతలతో కుమ్మక్కయ్యారని, దీనికి సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయన్నారు. పేద ముస్లిం పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే తరాల కోసం వక్ఫ్ బోర్డును సంస్కరించాల్సిన అవసరం వుందని ఇంద్రేశ్ కుమార్ నొక్కి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *