శబరిమలలో మకర జ్యోతి దర్శనం
సంక్రాంతి పర్వదినాన లక్షలాది మంది అయ్యప్ప స్వాములు, భక్తులు మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. మకర జ్యోతి సందర్భంగా భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమలకు చేరుకున్నారు. పొన్నంబలమేడుపై వెలిగే జ్యోతిని దర్శనం చేసుకొని, తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా శబరిమల ప్రాంతం అంతా స్వామియే శరణం అయ్యప్ప, శరణు ఘోషతో మార్మోగిపోయింది. దాదాపుగా 1.5 లక్షలకు పైగా అయ్యప్ప స్వాములు జ్యోతి దర్శనం కోసం శబరిమలకు తరలి వచ్చారు.సంప్రదాయం ప్రకారం మూడు సార్లు పొన్నంబల మేడుపై స్వామి అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనమిచ్చారు. అయ్యప్ప స్వామికి సర్వాభరణాలతో అలంకరణ చేయగానే… పొన్నంబల మేడుపై స్వామి జ్యోతి రూపంలో కనిపించారు. మకరజ్యోతిని వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది.
కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. అది చూసి మనసు నిండుగా భక్తిభావంతో తన్మయం చెందిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణమిల్లారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
దీక్ష విరమణ చేసిన అయ్యప్ప స్వాములు
41 రోజుల పాటు అయ్యప్ప స్వాములు దీక్షా ధారణ చేస్తారు. దీక్షా విరమణ శబరిమలలో చేస్తారు. జ్యోతి దర్శనం అయిన తర్వాత… 18 మెట్లు ఎక్కి, స్వామిని దర్శనం చేసుకొని, దీక్షా విరమణ చేస్తారు.మకరజ్యోతి దర్శనం కోసం శబరిమలకు వచ్చిన భక్తుల కోసం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మకర జ్యోతి దర్శనం అనంతరం భక్తుల తిరుగు ప్రయాణం కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పంపా నుంచి అదనంగా 800 వందల బస్సులను ఏర్పాటు చేసింది.
అంతకుముందు పందళరాజ వంశీయులు మణికంఠునికి స్వర్ణాభరణాలతో కాలినడకన శబరిమలకు వచ్చారు.. వలియకొయిక్కల్ శ్రీధర్మశాస్త ఆలయం నుంచి 12 మంది పందళరాజ వంశీయులు తిరువాభరణాలతో కూడిన మూడు పెట్టెలను శిరస్సున ధరించి.. వడివడిగా అడుగులు వేసుకుంటూ.. సన్నిధానం వచ్చారు.. మూడురోజుల ఈ తిరువాభరణం ఊరేగింపు యాత్రను 15మంది సభ్యుల ట్రావెన్కోర్ దేవస్థానం బృందం కోఆర్డినేట్ చేసింది. ఈ సాయంత్రం తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకున్నారు.. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి..వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరించారు.. అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిచ్చింది..