కైలాస్ మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ…
భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మరో ముందడుగు పడింది. రానున్న వేసవిలో కైలాస్ మానస సరోవర్ యాత్రను పునరుద్ధరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. టిబెట్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాల సందర్శన కరోనా కారణంగా 2020 నుంచి నిలిచిపోయాయి. అనంతరం గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఒప్పందాలను పునరుద్ధరించుకోలేదు.
తాజాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ బీజింగ్లో చైనా ఉప విదేశాంగ మంత్రితో జరిపిన చర్చల్లో ఈ విషయమై అంగీకారం కుదిరింది. మరోవైపు, రెండు దేశాల మధ్య నేరుగా తిరిగే విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించాలని ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.
ఇందుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై చర్చించేందుకు రెండు దేశాల అధికారులు త్వరలోనే భేటీ కానున్నారు. మీడియా, థింక్-ట్యాంక్ పరస్పర చర్యలతో సహా ప్రజల మధ్య మార్పిడిని మరింత ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి చర్యలు తీసుకోవడానికి కూడా రెండు వర్గాలు అంగీకరించాయి. దౌత్య సంబంధాల స్థాపన 75వ వార్షికోత్సవాన్ని ప్రజలలో పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఉపయోగించుకోవాలని భారతదేశం, చైనా రెండూ కట్టుబడి ఉన్నాయి.