పక్షుల కోసం మట్టి పాత్రలను పంపిణీ చేస్తూ.. ప్రకృతిని కాపాడుతున్న నారాయణ్

ఈ ప్రకృతిని తమ కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తులు చాలా మందే వున్నారు. తమకు తోచిన విధంగా, వివిధ మార్గాల్లో ఈ ప్రకృతిని రక్షిస్తుంటారు. ఇదే కోవలోకి వచ్చే వ్యక్త శ్రీరామ్ నారాయణ్. కేరళలోని ముప్పతడం అనే చిన్న గ్రామంలో వుంటూ ప్రకృతిని రక్షిస్తున్నాడు. గత 16 సంవత్సరాలుగా వేసవిలో మట్టి పాత్రలను ఉచితంగా అందిస్తున్నారు. ఎండలకు నీళ్ల కోసం పక్షులు ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర వ్యాప్తంగా 1.6 లక్షల మట్టి పాత్రలను అందించారు.తన సొంత డబ్బుతోనే దీనిని చేస్తున్నారు. ఈ నారాయణ్ సేవను ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో కూడా ప్రస్తావిస్తూ, ప్రశంసించారు.

‘‘వేసవి తీవ్రత యేటికి యేడాది పెరుగుతోంది. నీటి వనరులు కూడా పరిమితం అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో మనుషులే కాదు.. జంతువులు, పక్షులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఇందుకోసమే మట్టి పాత్రలను పంచుతూ… పక్షుల కోసం వీటిలో నీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఓ ప్రత్యామ్నాయాని చూపిస్తున్నా’ అని నారాయణ్ తెలిపారు.

‘‘ప్రాణాలను కాపాడే నీటి కోసం ఓ మట్టి కుండ’’ అన్న పేరుతో 2018 లో నారాయణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇతర రకాల పాత్రలు కాకుండా పర్యావరణ హితమైన మట్టి కుండలనే తాను ఎంచుకున్నానని తెలిపారు. రెసిడెన్షియల్ అసోసియేషన్లు, క్లబ్బులు, విద్యా సంస్థలకు, ఇతర సేవా సంస్థలకు ఇప్పటికే దాదాపు 10 వేలకు పైగా మట్టి కుండలను పంపిణీ చేశారు.నారాయణ్ వృత్తి రీత్యా తన గ్రామంలో లాటరీ వ్యాపారంతో పాటు చిన్న రెస్టారెంట్ నడుపుతున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ సమాజ సేవ చేస్తున్నారు.

తనకుండే కుటుంబ బాధ్యతలన్నీ పూర్తి చేశానని, ఆ పనులు పూర్తయ్యాకే పూర్తి సమయం పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయిస్తున్నట్లు నారాయణ్ పేర్కొన్నారు. ఇప్పటికే 10 వేలకు పైగా మట్టి కుండలను కొనడానికి దాదాపు 8 లక్షలకు పైగానే ఖర్చైందని, ఇంకా ఎంతైనా పెట్టడానికి వెనకాడనని అన్నారు.

మరో పుణ్య కార్యాన్ని కూడా నారాయణ్ చేస్తున్నారు. జిల్లా అంతటా గత యేడాది 15 లక్షల విలువైన 50,000 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే వాటి సంరక్షణ గురించి కూడా అందరికీ చెప్పారు. ఇదే కాకుండా ముప్పతడంలోని తన సొంత గ్రామంలో 10,000 మొక్కలను స్వయంగా నాటి, ప్రకృతిని రక్షిస్తున్నారు. అయితే.. ఈ చెట్లను నాటే సమయంలో పక్షుల కోసం ప్రతి ఆవరణలో ఓ పండ్ల చెట్టు కూడా వుంచాలని అవగాహన కల్పిస్తున్నారు.

‘‘నేను ప్రకృతి ఒడి వున్న గ్రామంలో పెరగలేదు. నగరంలోనే పెరిగాను. అయినా.. ప్రకృతి విలువలు, ప్రకృతిని ఆస్వాదించే గుణం, ప్రకృతిని కాపాడుకునే సున్నిత స్వభావం నాకు అబ్బాయి. తాను వుంచిన మట్టి కుండల్లో పక్షులు నీరు తాగుతుంటే.. వాటి ధ్వనులు వింటుంటే చాలా ఆనందంగా వుంది. ప్రకృతిని ఆస్వాదిస్తున్నా’’ అని నారాయణ్ సంతృప్తి వ్యక్తం చేశారు.

రానూ రానూ పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. ఎక్కడా కనిపించడం లేదని వాపోయారు. దానికి రకరకాల కారణాలున్నాయని నారాయణ్ అన్నారు. కానీ.. ఇలా నీరు పెట్టడం, కొద్దిగా ఆహారం అందుబాటులో వుంచితే.. పిచ్చుకలు తమ ఆవరణలోకి వస్తున్నాయని తెలిపారు. ప్రకృతి పాడైపోతోంది… పక్షులు కనిపించకుండా పోతున్నాయని ఆవేదన చెందడం కంటే తమ వంతు ప్రయత్నం చేయడం వైపే తాను మొగ్గు చూపుతానని వివరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *