కెనడాలోని హిందూ ఆలయంపై ఖలిస్తానీల దాడి… దేవాలయంలోకి దూరి మరీ
కెనడాలో ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రాంప్టన్ లోని హిందూ సభ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. దేవాలయంలోకి ప్రవేశించి మరీ అక్కడి భక్తులపై దాడిచేశారు. ఈ సమయంలో చిన్న పిల్లలు కూడా మందిరంలోనే వున్నారు. అయినా ఖలిస్తానీ ఛాందసులు దాడి చేస్తూనే వున్నారు. ఈ దాడి అత్యంత ఘోరంగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఖలిస్తానీలు దాడి చేసిన విషయాన్ని భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్రశేఖర్ ఆర్య వెల్లడించారు. కెనడా రాజకీయాల్లోనే కాకుండా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల్లోకి కూడా అతివాద ఖలిస్తానీలు చొరబడ్డారన్న విషయాన్ని తాము పదే పదే చెబుతున్నామని, ఇప్పుడు నిజమైందన్నారు. మరోవైపు ఇంత దాడి జరిగినా ప్రధాని ట్రూడో పొడిపొడిగానే స్పందించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.హిందువులు ముందుకు వచ్చి, తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
కెనడాలోని బ్రాంప్టన్ హిందూ దేవాలయంలోని హిందూ భక్తులపై ఆదివారం ఈ దాడి జరిగింది. దేవాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న ఖలిస్తానీలు బారికేడ్లను బద్దలు కొట్టి మరీ, ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడే వున్న హిందూ భక్తులపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ దాడి జరగ్గానే భారతీయ సంతతికి చెందిన ఎంపీ చంద్రశేఖర్ ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిని చూస్తుంటే ఛాందసుల మూలాలు కెనడాలో ఎంత బలంగా వున్నాయో అర్థమైపోతుంది.
మరోవైపు ఈ దాడిపై భారత హైకమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీని వెనుక భారత వ్యతిరేక శక్తులు వున్నాయని ఒట్టావాలోని భారత హైకమిషన్ ప్రకటించింది. గతంలో మాదిరిగానే ఓట్టావాలోని హైకమిషన్, వాంకోవర్, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సాధారణ కార్యకలాపాల నిమిత్తం క్యాంపులను నిర్వహిస్తోందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భద్రత అందించాలని ప్రభుత్వాన్ని ముందే కోరినట్లు పేర్కొంది. భారత వ్యతిరేక శక్తుల దాడితో తమ క్యాంపు కార్యాలయాలకు అంతరాయం కలిగిందని, హిందూ భక్తులపై దాడి చేయడం లాంటి చర్యలు తీవ్ర ఆందోళనను, నిరాశకు గురిచేశాయని తెలిపింది. భారత పౌరుల భద్రత పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని ట్విట్టర్ వేదికగా పేర్కొంది.