వేద వ్యవసాయ పద్ధతి ద్వారా మళ్లీ ”కృష్ణవ్రీహి” బియ్యం
వేద వ్యవసాయ పద్ధతి ద్వారా నల్లబియ్యం మళ్లీ పడింది. వేద వ్యవసాయ శాస్త్రవేత్త కౌటిల్య కృష్ణన్ ఈ కృష్ణవ్రీహి బియ్యాన్ని పండించారు. వేదాల ఆధారంగా రెండవ సారి విజయవంతంగా తన పొలంలో నల్ల బియ్యాన్ని పండించినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఖాసింపేట గ్రామంలోని తన 3 ఎకరాల పొలంలో కృష్ణ వ్రీహీ (నల్ల బియ్యం) పండించడంలో కౌటిల్య మరోసారి విజయవంతమయ్యారు. వేద వ్యవసాయంలో భాగంగా పాలు, తేనెతో పాటు అగ్నిహోత్ర భస్మం కూడా వాడినట్లు చెప్పారు. అధిక దిగుబడి కోసం ఆవుపేడను ఎరువుగా వాడినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో వేద వ్యవసాయం ద్వారా వంద శాతం పంట పండిందని చెప్పారు. చుట్టుపక్కల రైతులు కూడా కౌటిల్య పొలాన్ని సందర్శించి ప్రశంసలు కురిపిస్తున్నారు.
దేశీయ విత్తనాల వల్ల పలు ప్రయోజనాలున్నాయి. నాటు విత్తనాలు వాడటం ద్వారా పురుగులు వచ్చే శాతం తక్కువ. రుచి బాగుంటుంది. విత్తనాలు వంద శాతం మొలకెత్తే అవకాశం ఉంటుంది. భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు. ఎలాంటి భూమిలోనైనా పంట బ్రహ్మాండంగా పండుతుంది. పంట దిగుబడి బాగా వస్తుంది. రైతన్నలు నాటు విత్తనాలు నిల్వ చేసుకుని తదుపరి పంటకు మళ్లీ వేసుకోవచ్చు. దేశీయ విత్తనాల్లో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. దేశీయ విత్తనాలు వాడటం వల్ల ఆర్ధికంగా కూడా రైతులు లాభపడతారు. దేశీయ విత్తనాల వల్ల అన్నదాతలు ఆర్ధికంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.