శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదం : ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ
శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదంపై అలహాబాదు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముస్లిం పక్షానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆర్డర్ 7 రూల్ 11పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. హిందూ పక్షం దాఖలు చేసిన అన్ని కేసులను విచారించవచ్చని కోర్టు అంగీకరించింది.
హిందూ పక్షం దాఖలు చేసిన 18 కేసులను వారి మెరిట్ ఆధారంగా విచారిస్తామని, అవన్నీ కోర్టులో విచారణకు అర్హమైనవేనని కూడా ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులు ప్రార్థనా స్థలాల చట్టానికి విరుద్ధమైనందున వాటిని విచారించలేమన్న షాహీ ఈద్గా కమిటీ సవాలును హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్ నిర్వహణను ముస్లిం పక్షం హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. పూజా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టం, పరిమితి చట్టం, నిర్దిష్ట స్వాధీన ఉపశమన చట్టాన్ని ఉటంకిస్తూ హిందూ పక్షం పిటిషన్లను కొట్టేయాలని ముస్లిం పక్షం వాదించింది. ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది.