ఇకపై పార్లమెంట్ లో సంస్కృతంలోనూ అనువాదం : స్పీకర్ ప్రకటన
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో అనువాదాలు చేసే భాషలను పెంచుతున్నామని ప్రకటించారు. ఇక నుంచి అనువాద ప్రక్రియల్లోకి మరో ఆరు కొత్త భాషలను చేర్చారు. బోడో, డోంగ్రీ, మైథిలీ, మణిపూరి, ఉర్దూ, సంస్కృత భాషల్లో కూడా ఇకపై అనువాదాలు చేస్తామని స్పీకర్ ప్రకటించారు. గతంలో హిందీ, ఇంగ్లీషుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు వంటి 10 భాషల్లో అనువాద సేవలు అందుబాటులో ఉండేవని చెప్పారు.
ఇప్పుడు మరో ఆరు భాషలను కూడా అనువాద ప్రక్రియలో చేర్చామని ఓం బిర్లా పేర్కొన్నారు. బోడో, డోగ్రీ, మైథిలి, మణిపురి, ఉర్దూ మరియు సంస్కృతం. దీనితో పాటు, అదనంగా ఉన్న 16 భాషలకు, మానవ వనరులు అందుబాటులోకి వచ్చినందున, వాటిలో కూడా ఏక కాలంలో అనువాదాలు చేస్తామన్నారు. దేశంలోని 22 భాషల్లో ఈ అనువాద ప్రక్రియ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియను ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకుంటున్నాయన్నారు. అధికారికంగా గుర్తించిన 22 భాషల్లో భవిష్యత్తుల్లో అనువాదాలు చేయాలన్న ప్రయత్నంలో వున్నామని స్పీకర్ పేర్కొన్నారు.