ఆ డబ్బు దేవుళ్లదే.. ప్రభుత్వం వాడొద్దు : స్టాలిన్ సర్కార్ కి హైకోర్టు మందలింపు
తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మునుపటి ఆదేశాలను పాటించడంలో స్టాలిన్ నేతృత్వంలోని ద్రావిడ సిద్ధాంతాలతో నడిచే డీఎంకే ప్రభుత్వంపై మద్రాసు హైకోర్టు మండిపడింది. హిందువుల ఆలయాల నిధులను ఉపయోగించి, కల్యాణ మంటపాలను నిర్మించడానికి అనుమతినిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఐదు ప్రభుత్వ ఉత్తర్వులను మద్రాసు హైకోర్టు కొట్టేసింది.ప్రజలకు సంబంధించిన ఆలయ నిధులను ప్రభుత్వ ధనంగా పరిగణించరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. న్యాయమూర్తులు ఎస్.ఎం. సుబ్రమణ్యం, జి. అరుళ్ మురుగన్ లతో కూడిన డివిజన్ బెంచ్, కొన్ని పిటిషన్లను విచారిస్తూ, ఆలయ నిధులను ప్రభుత్వ లేదా ప్రభుత్వ నిధులుగా పరిగణించరాదని తీర్పు చెప్పింది.
భక్తులు ఆలయానికి సమర్పించిన డబ్బు దేవుళ్లకే చెందుతుంది. భక్తులు సమర్పించిన హుండీ నిధులు, దాతలిచ్చిన ఆస్తులు.. ఇలా అన్నీ దేవుడికే చెందుతాయి. దేవుడే వాటికి యజమాని. చట్టం ప్రకారం ఆలయంలోని దేవతను మైనర్ గా పరిగణిస్తారు. అందువల్ల దేవతే వాటికి యజమాని’’ అని జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం, జస్టిస్ జి. అరుళ్ మురుగన్ లతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. భక్తులు లేదా దాతలు ఇచ్చిన నిధులు, ఆస్తులను ఆలయ ఉత్సవాలు, దేవాలయాల అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని కోర్టు సూచించింది. అంతేగానీ మతేతర కార్యకలాపాలకు మాత్రం ఉపయోగించవద్దని, అలా చేస్తే, హిందువుల మత స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించినట్లేనని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది.