చినాబ్ వంతెనను సాకారం చేసిన నారీశక్తి ప్రొఫెసర్ మాధవీలత
చీనాబ్ వంతెన నిర్మాణం సాకారంలో ముఖ్య భూమికను పోషించింది ఓ శక్తి స్వరూపిణి. ఆమె పేరే ప్రొఫెసర్ మాధవీలత. సాదాసీదాగా కనిపించే ఆమె ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం కోసం ఎన్నో కలలు కన్నారు. 2000ల సంవత్సరంలోనే ఆ కలకు ఊపిర్లూదారు. దానిని సాకారం చేస్తూ జూన్ 06, 2025న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీనాబ్ రైల్వే బ్రిడ్జిని దేశం గర్వించే విధంగా ప్రారంభించారు. తన 17 సంవత్సరాల కృషి ఎట్టకేలకు సాకారం అవ్వడంతో మాధవిలత ఆనందానికి గురయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా చీనాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సాంకేతిక సహాయాన్ని అందించిన బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)కు చెందిన జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మాధవీలత గురించి మరింత తెలుసుకుందాం.
ప్రొఫెసర్ మాధవీలత 1992లో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జెఎన్టీయు) నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బిటెక్, తరువాత ఆమె ఎన్ఐటీ వరంగల్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పట్టా పొందారు. అక్కడే బంగారు పతకాన్ని అందుకున్నారు. 2000 సంవత్సరంలో ఆమె ఐఐటీ మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి సాధించారు. చీనాబ్ వంతెన ప్రాజెక్టుతో ప్రొఫెసర్ మాధవీలత అనుబంధం అదే సంవత్సరంలో ప్రారంభంలో ప్రారంభమైంది. నాటి నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా దాదాపు రెండు దశాబ్దాల పాటు నిరంతర సాంకేతిక సహాయాన్ని ఆమె ప్రభుత్వానికి అందించారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, ఎత్తైన ప్రదేశంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని సాకారం చేసేందుకు పరితపించారు. ఇంజనీర్లకు మార్గ నిర్దేశనం చేస్తూ వారిని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రోత్సహించారు.
మాధవిలత సహాయ సహాకారాలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. స్వయంగా ఎన్నోసార్లు చీనాల్ రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని స్వయంగా సందర్శించారు. పరిశీలన జరిపి సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. నిర్మాణాత్మక సమాలోచనల్లో భాగస్వాములయ్యారు. అక్కడి భూమి స్వభావాన్ని అర్థం చేసుకొని అందుకు అనుగుణమైన ముడి సరులకు వినియోగం, నిర్మాణ కొలతలు, వాటి రూపు రేఖలను గురించి సలహాలు, సూచనలను పంచుకున్నారు. అయితే ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన కట్టడం నిర్మించడం అంటే మాటలు కాదు. అందుకు తపన ఉంటే సరిపోదు. సరైన అవగాహన, అందుకు సంబంధించిన విషయ అనుభవం కూడా ఎంతో అవసరం. చిన్న పొరపాటు కూడా పెను ప్రమాదాలను తీసుకొస్తుంది. పటిష్టమైన చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం మాధవిలత అనుభవాన్ని మన కళ్ళకు కడుతుంది.
వాస్తవంలో మాధవీలత దేశంలోని ప్రముఖ జియోటెక్నికల్ నిపుణులలో ఒకరిగా ఎదిగారు. అనుబంధ రంగంలో దశాబ్దాలుగా ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు అలంకారంగా మారాయి. అది మాత్రమేనా ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ నుంచి ఉత్తమ మహిళా జియోటెక్నికల్ పరిశోధకురాలిగా అవార్డును కూడా అందుకున్నారు. 2022 సంవత్సరం నాటికి దేశంలోని స్టెమ్ విభాగంలో టాప్ 75 మహిళల్లో ఒకరిగా నిలిచారు. నేడు ఐఐఎస్సీలో భావి ఇంజనీర్లకు హెచ్ఏజీ గ్రేడ్ ప్రొఫెసరుగా మార్గదర్శనం చేస్తున్నారు. సమర్థులనే సవాళ్ళు పలకరిస్తాయనేందుకు ఈ నారీ శక్తి ఓ చక్కటి ఉదాహరణ.
చీనాబ్ నదిపై వంతెన నిర్మాణం ఓ పెను సవాల్…
జమ్మూ కాశ్మీరులోని చీనాబ్ నదిపై అంతెత్తున రైల్వే బ్రిడ్జి నిర్మించడం ఏమి ఆషామాషీ విషయం కాదు. అదొక పెను సవాల్ వంటిది. నదికి 359 మీటర్ల ఎత్తులో అంటే ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా బ్రిడ్జి నిర్మాణం జరిగిందంటే అతిశయోక్తి కాదు. అదొక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పుకోవాలి. కొండ వాలులో, పెళుసైన రాతితో ఉన్న లోయలో అసామాన్యమైన చీనాబ్ నది సాకారం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం.
ప్రతికూల వాతావరణం, భౌగోళిక అస్థిరత్వాన్ని తట్టుకునే విధంగా స్థిరమైన పద్ధతులను సిఫార్సు చేసే బాధ్యతను మాధవీలత తన భుజాలపై వేసుకున్నారనడంలో ఆశ్చర్యం లేదు.
గంటకు 220 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, భూ ప్రకంపనలను తట్టుకోగలిగేలా పునాదులను రూపొందించడంలో సహకారించడం ద్వారా ఆమె మొదటి విజయం సాధించారు. ఒకానొక సందర్భంలో మాధవి లత మాట్లాడుతూ అత్యంత కష్టతరమైన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన చీనాబ్ నదిపై భద్రతాపరంగా నిర్ణయాలను తీసుకునేందుకు మూడుసార్లు పరిశీలనలను జరిపి ప్రతిపాదనలను ధ్రువీకరించాల్సి వచ్చిందన్నారు. ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరుతో కలిసి పనిచేస్తూ ప్రతి క్షణం మార్పులు చేర్పులు చేశారు మాధవీలత. ప్రభుత్వ సహకారం, భవ్య భారత సాకారానికి కలలు కనే నాయకత్వం మద్ధతుతో చీనాబ్ రైల్వే బ్రిడ్జి సాకారమైంది.దేశ చరిత్రలో గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా ఇది నిలిచిపోతుంది. ప్రొఫెసర్ మాధవి లత భారతీయుల గుండెల్లో గుర్తుగా మిగిలిపోతుంది.