త్రిపురలో 500 మంది మిలిటెంట్ల లొంగుబాటు
త్రిపుర విమోచన జాతీయ కూటమి, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ కి చెందిన 500 మంది ఉగ్రవాదులు ఆయుధాలను వీడారు. తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సిపాహీజాలా జిల్లాలోని జంపుయిజాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాణిక్ సాహా ఆధ్వర్యంలో ఆయుధాలను విడిచి, జనజీవన స్రవంతిలో కలిశారు. మిలిటెంట్ గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా ఈ లొంగుబాటు జరిగింది. మిలిటెంట్లు తమ ఆయుధాలను నేరుగా ముఖ్యమంత్రికే అందజేసి, లొంగిపోయారు. మిలిటెంట్లు భారీ సంఖ్యలో లొంగిపోవడం, జనజీవన స్రవంతిలో కలవడం అత్యంత ఆనందకరమని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వనవాసీల సమగ్ర అభివృద్ధి కోసం వివిధ పథకాలను ప్రవేశపెడుతూ, సమగ్ర అభివృద్ధి చేస్తున్నాయని వివరించారు. హింసా మార్గాన్ని వీడి జనజీవనంలో కలిసిన వారిని తమ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానిస్తోందని ప్రకటించారు. ఆయుధాలను త్యజించిన మిలిటెంట్ల పునరావసం కోసం కేంద్రం 250 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని సీఎం తెలిపారు.