కనీస మద్దతు ధర ఎలా?

– చాడా శాస్త్రి

ప్రస్తుతం అంతా MSP అంటే కనీస మద్దతు ధర పెంచాలి అని అడుగుతున్నారు. అంటే మద్దతు ధరలు పెరిగే కొద్దీ రిటైల్‌లో వినియోగదారుల ధరలు పెరుగుతాయి. ఉదాహరణకు వరికి ఇప్పుడు మద్దతు ధర సుమారు 1900 ఉంది. అంటే రిటైల్‌లో బియ్యం ధర 40 నుండి 50 వరకు క్వాలిటీ బట్టి ఉంటుంది. అంటే అదే మద్దతు ధర 3000 చేస్తే రిటైల్‌ ధరలు కిలో 70-80 ఉంటాయి. ఇలా ధరలు పెరిగితే ఎక్కువగా ఇబ్బంది పడేది అల్ప ఆదాయ వర్గాలవారే.

వారికి అసలే ఉన్న స్వల్ప ఆదాయాల్లో తిండి కోసమే ఇంకా ఖర్చుచేయవలసి వస్తుంది. మళ్లీ ప్రభుత్వం రేషన్‌ ద్వారా సబ్సిడీ లు ఇచ్చి బీదవారికి చవగ్గా సప్లై చేయవలసి వస్తుంది. ఆ సబ్సిడీ డబ్బులు సాధారణ పౌరులే వివిధ టాక్స్‌ల ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి.

MSP బాగా వస్తున్నాయి అని దేశంలో వరి, గోధుమ పంటలు ఎక్కువగా వేస్తున్నారు. ప్రభుత్వం ఆ పంటలను FCI ద్వారా కొనుగోలు చేసి నిల్వ చేస్తోంది. మన దేశానికి ఆహార బధ్రతా నిల్వలు 41 మిలియన్‌ టన్నులుగా లెక్క వేశారు. కానీ ప్రస్తుతం అవి సుమారు 90 మిలియన్‌ టన్నులకు పైబడి ఉన్నాయి. అంటే ఇలా అవసరం లేని నిల్వలు విలువ అక్షరాలా 1,80,000 కోట్లు. ఊరికే వృధాగా గోడౌన్స్‌లో పడి ఉన్నాయి. గోధు మలు నిల్వ చేయడానికి గోడౌన్స్‌ చాలక ఆరుబయట ప్లాస్టిక్‌ కవర్లు కప్పి ఉంచుతున్నారు. వీటి నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి తడిసిమోపుడు అవుతోంది.

అయినా FCI ఈ సరుకులు వదిలించుకోక పోతే మళ్లీ కొత్త పంట ఎలా కొనుగోలు చేస్తారు? అందుకే FCI సేకరించిన ధర కన్నా తక్కువ ధరకు బయట మార్కెట్‌లో వేలం వేసి అమ్ముతోంది. బయట నిలవ ఉంచుతున్న గోధుమలు తడిసిపోతు న్నాయి. కాబట్టి వాటిని ఆల్కహాల్‌ పరిశ్రమలకు చవగ్గా అమ్మేస్తోంది.

అత్యంత ఆధునిక వ్యవసాయ పద్దతులు అవలంబిస్తున్న విదేశాలు అంటే అమెరికా చైనా బ్రెజిల్‌ మొదలైన దేశాల్లో ఉత్పత్తి ఖర్చులు తక్కువగా ఉండి అక్కడ ఉత్పత్తి ధరలు తక్కువగా ఉంటాయి.. ఇక్కడ ఉత్పత్తి ధరల కంటే ఆ దేశాల్లో ధరలు తక్కువ ఉంటే ఇక్కడ పండిరచిన ఎక్కువ ఉత్పత్తులు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉండదు. అంతే కాక ఇక్కడ ఎగుమతుల కోసం అంటూ ప్రత్యేకంగా పండిస్తే కానీ మన సాధారణ ఆహార ధాన్యాలు అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోవు. అలా కాక రైతులు అందరూ పోలోమని ఈ వరి, గోధుమలు కాకుండా వాణిజ్య పంటలు, విదేశాల్లో బాగా డిమాండ్‌ ఉన్న వస్తువులకు సంబంధించిన పంటలు వేసుకుంటే వారి ఆదాయాలు మెరుగు పడతాయి. దేశానికి విదేశీ మారకద్రవ్యం లభిస్తుంది. కానీ ఇలా వేయడానికి చిన్న రైతులు ధైర్యం చెయ్యలేరు.

మరి దీనికి పరిష్కారం?

MSP పెంచుతూ పోవడం కాదు. ఉత్పత్తి ఖర్చులు తగ్గించే మార్గాలు వెతకాలి. ఉన్న భూముల్లోనే ఎక్కువ మొత్తాలలో పంటలు పండిరచి ఖర్చులు తగ్గించే విధంగా విదేశాలలో లాగా కార్పొరేట్‌ ఫార్మింగ్‌ లేదా కనీసం కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ చేపట్టాలి.

ఒకటి రెండు ఎకరాల్లో కాకుండా ఒకేసారి ఒక వంద రెండు వందల హెక్టార్లలో పంటలు పండిరచే ప్రణాళికలు చెయ్యాలి. రైతులు తమ భూములను ఎదో కంపెనీకి కౌలుకి ఇవ్వాలి. రైతులకు ఖచ్చితమైన కౌలు డబ్బులతో పాటు ఆ వ్యవసాయ క్షేత్రంలో తిరిగి పనిచేసి వేతనం పొందవచ్చు. రైతు రెండు విధాలా ఆదాయం పొందుతాడు ఏ విధమైన రిస్క్‌ లేకుండా. ఖాళీ సమయాల్లో వేరే పనులుకు కూడా పోవచ్చు.

అప్పుడు ప్రభుత్వాలకు ఈ MSPలు బెడద తప్పుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *