మనపైకి కాలు దువ్విన వారిని కూడా ఆదుకున్న గుణం మనది : మోహన్ భాగవత్

కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ మొత్తాన్నీ స్వాధీనం చేసుకోగల సత్తా భారత్ కి ఉన్నప్పటికీ… భారత్ చాలా సంయమనం పాటించిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత్ వ్యవహరించిన తీరు విషయంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల సూరత్ పర్యటన సందర్భంగా ఆయన జైన్ గురువులను సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా జైన గురువులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ లో చొరబాటును పాక్ మొదట ప్రారంభించిందని, కానీ.. భారత్ మాత్రం అక్రమంగా సరిహద్దును దాటకూడదని సైన్యాధికారులు ఆదేశాలతో పనిచేసిందన్నారు.అంతటి కఠిన సమయంలోనూ భారత్ రక్షణ సూత్రాలను పాటించిందన్నారు.
భారత్ ఎవ్వరిపై అకారణంగా దాడి చేయదని, ఇతరులు కూడా మనపై దాడి చేయనివ్వమని పేర్కొన్నారు. భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టేసిన వారు కూడా ఇబ్బందుల్లో వుంటే వారికి కూడా సహాయం చేసే గుణం భారత దేశానిదని చెప్పుకొచ్చారు. అయితే ఇంతటి విషయం వెనుక ఆధ్యాత్మికత పునాదులు వున్నాయని ఆయన వివరించారు. పాకిస్తాన్ లోనికి వెళ్లి, సర్జికల్ స్ట్రైక్స్ చేసినా సరే… మొత్తం పాకిస్తాన్ ని భారత సైన్యం టార్గెట్ చేయలేదని, భారత్ కి ఇబ్బందులు కలిగించే వారిపై, ఆ ప్రాంతంపై మాత్రమే దాడి చేశామని గుర్తు చేశారు.
మరోవైపు బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిపై కూడా మోహన్ భాగవత్ స్పందించారు. ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండానే అక్కడి హిందువులు టార్గెట్ అయ్యారని, హింసను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా భారత ప్రజలు చివరికి అన్ని సమస్యలను ఎదుర్కొని, పరిష్కరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై అందరూ ఆందోళన చెందుతున్నారని, అయితే.. భయపడాల్సిన పనే లేదని ధైర్యమిచ్చారు. అందరు కలిసి సమస్యలను పరిష్కరిస్తామని, భారత్ నుంచి ప్రపంచం ప్రేరణ పొందుతోందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *