లోక కళ్యాణమే ధ్యేయంగా పాత్రికేయులు పని చెయ్యాలి – ప్రఫుల్ల కేత్కర్
సమాచారభారతి ఆధ్వర్యంలో ‘‘మొదటి ఆదర్శనీయ పాత్రికేయుడు’’ నారద మహర్షి జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది కూడా పాత్రికేయులకు ప్రతిభా పురస్కారాలు సన్మాన సత్కారాలు జరిగాయి. ఏప్రిల్ 30న భాగ్య నగరం లోని రెడ్ హిల్స్లోని FTCCI ఆడిటోరియంలో లబ్ద ప్రతిష్టులైన పాత్రికేయుల సమక్షంలో వైభవోపేతంగా జరిగింది.
ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులకు పురస్కారాలను అందజేశారు. ‘‘వడ్లమూడి స్మారక పురస్కారం’’ సీనియర్ పాత్రికేయులు శ్రీ రమా విశ్వనాథ్ గారికి అందించారు. భండారు సదాశివ రావు స్మారక’ పురస్కారం సీనియర్ పాత్రికేయులు శ్రీ సామవేదం జానకీరామశర్మ, సమాచారభారతి కాలమిస్ట్’ పురస్కారం కాలమిస్ట్ శ్యామసుందర్ వరయొగి, ‘సమాచారభారతి యువపురస్కారం’ యువ పాత్రికేయులు శ్రీ కొంటు మల్లేశం అందుకున్నారు. సమాచారభారతి అధ్యక్షులు డా. జి గోపాలరెడ్డి గారు సమాచారభారతి ఆవిర్భావం, జాతీయ భావ ఆలోచనా స్రవంతిని నిలబెట్టాల్సిన అవసరం గురించి వివరించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ పత్రిక ‘ఆర్గనైజర్’ సంపాదకులు శ్రీ ప్రఫుల్ల కేత్కర్ గారు మాట్లాడుతూ నారద మహర్షి ని గురించిన అపార్థ ప్రచారం చేయడంతో వారి లోకకళ్యాణ దృష్టిని గమనించక పోవడం జరిగింద న్నారు. 30 మే 1826వ సంవత్సరం కలకత్తాలో ప్రారంభమైన ఉద్దండ్ మార్తాండ్ పత్రిక ‘నారద మహర్షి’ ముఖచిత్రంతో ప్రచురితం అయ్యిందనీ, ఆ తర్వాత అనేక పర్యాయాలు నారద మహర్షిని పత్రికా రంగ ఆద్యునిగా గుర్తించినా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కనుమరుగు చేశారని వాపోయారు. పత్రికల పై ఆంక్షలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మా పత్రిక ఎదుర్కొందని, నెహ్రూ ప్రభుత్వం విచిత్రమైన ఆంక్షలు విధించిందనీ, దేశవిభజన సమయంలో దాడికి గురైన పాకిస్థాన్, తూర్పు పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) హిందువుల పరిస్థితిని గురించి రాయొద్దన్నారని గుర్తు చేశారు. సమాజం ఎప్పుడు మార్పునకు గురవుతుందని, పత్రికలు లేదా పాత్రికేయత కూడా అలాంటి మార్పునకు గురవుతుందనడానికి తగ్గట్టుగా మార్పులు సహజమైన మౌలిక విలువలను వదిలేయకూడదని హితవు చెప్పారు. పాత్రికేయులు నారద సూత్రాలలోని 75, 76, 77వ సూత్రాలను ఆదర్శంగా తీసుకొని సరైన ప్రశ్నలు అడగటం, సరైన వ్యక్తి ని అడగటం, సరైన సమయంలో వార్తను ఇవ్వటం ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. పురస్కార గ్రహీతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సమాచారభారతి ఇతర సభ్యులు, కార్యదర్శి ఆయుష్ నడింపల్లి సహా దాదాపు 125 మంది కి పైగా పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.