చిరు ధాన్యాల విషయంలో మరింత ప్రచారం జరగాలి : కిసాన్ మేళాలో కేంద్ర మంత్రి

హైదరాబాద్ IIMR జాతీయ చిరుధాన్యాల రైతుల కిసాన్ మేళా జరిగింది. దీనిని జాతీయ వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారడంలో రైతుల పాత్ర చాలా వుందని, వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిశోధనల పాత్ర చాలా వుందని కొనియాడారు. రైతులకు సాధికారత కల్పించనంత కాలం దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

భారత్ ఆరోగ్యవంత దేశంగా మారడంలో చిరు ధాన్యాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. దీనిని దష్టిలో పెట్టుకొనే ప్రధాని నరేంద్ర మోదీ చిరు ధాన్యాలను శ్రీఅన్న గా అభివర్ణిస్తూ ప్రకటించారన్నారు. దీంతో ఈ చిరుధాన్యాలు జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయన్నారు. చిరు ధాన్యాల్లో పోషకాలు సమృద్ధిగా వుంటాయని, మానవులకే కాకుండా జంతువులు, పక్షులకు కూడా ఆరోగ్యకరమైన ఆహారం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గత పదేళ్లలో రైతుల ప్రయోజనం కోసం ఇతర పంటలతో పాటు చిరుధాన్యాల కనీస మద్దతు ధరను 2 నుంచి 3 రేట్లను పెంచామని పేర్కొన్నారు.

చిరుధాన్యాలను ప్రోత్సహించడంలో కేవీకేలు,ఎఫ్ పీఓ పాత్ర కీలకమని కొనియాడారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి మెరుగైన సాంకేతికపరిజ్ఞానాలను అందిస్తున్నారని ప్రశంసించారు. అయితే.. చిరు ధాన్యాల విషయంలో మరింత మార్కెటింగ్ జరగాలని, మరింత ప్రచారం జరగాలన్నారు. దీని విషయంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ పథకాన్ని అమలు చేయబోతోందని వెల్లడించారు. దీని ద్వారా ఖర్చులో 50 శాతం కేంద్రమే భరిస్తుందని, దీని ద్వారా డబ్బులు ఆదా అవుతాయన్నారు.

అలాగే, కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 నుండి 5 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు, ఎరువుల సబ్సిడీని భవిష్యత్తులో రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దేశంలో చిరు ధాన్యాల విషయంలో మరింత ప్రచారం జరగాలని, మరింత ఎక్కువగా వినియోగంలోకి రావాలని భగరీథ్ చౌదరి అభిప్రాయపడ్డారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *