భాగ్యనగరంలో ఘనంగా శ్రీరామ నవమి శోభాయాత్ర..

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ‘‘భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి’’ ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర జరిగింది. హిందువులు అత్యధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాషాయ జెండాలను చేతబూని, జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ నినాదాలిస్తూ… యాత్రలో పాల్గొన్నారు. అత్యంత ప్రాచీనమైన సీతారాంభాగ్ లోని శ్రీరామ మందిరం నుంచి కోటి వ్యాయామశాల వరకూ ఈ శోభాయాత్ర కొనసాగింది.
మరోవైపు ఈ ఆలయంలో జరిగిన సీతారామ కల్యాణోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధూల్‌పేట ఆకాశపురి హనుమాన్‌ దేవాలయం వద్ద హనుమాన్‌ చాలీసా పఠనం చేసి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్ ఆమోదం పొందిందని ఒవైసీ సోదరులు గగ్గోలు పెడుతున్నారని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎద్దేవా చేశారు. అయితే ఆ సోదరుల అరుపులకు ఇక్కడ ఎవరు భయపడరని ఆయన పేర్కొన్నారు. రామ్ మందిర్ నిర్మాణం జరగదని ఓవైసీ భావించారని రాజా సింగ్ చెప్పారు. కానీ శ్రీరామనవమి రోజు జనసంద్రాని చూసి ఒవైసీ కంగుతిన్నాడని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి భారత దేశం కాదు ఇదని, ప్రస్తుతం ఇది మోదీ భారత్ అని ఆయన అభివర్ణించారు. గతంలో రామ భక్తులు ఆలోచన, ఓర్పుతో ఉండేవారని గుర్తు చేశారు.వక్ఫ్ బోర్డ్ బిల్ పార్లమెంట్‌లో పాస్ చేశారని గుర్తు చేస్తూ వక్ఫ్ బోర్డు పేరు మీద ఎన్నో భూములు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని రాజాసింగ్ తెలిపారు. ఎలాంటి పాత్రలు, రిజిస్ట్రేషన్ లేకుండా వక్ఫ్ భూములంటూ బోర్డులు పెట్టిన సందర్భాలున్నాయిని గుర్తు చేశారు.
వక్ఫ్ బోర్డ్ రాక ముందు వాళ్ళకు 4 వేల ఎకరాల భూములు మాత్రమే ఉండేవని, కానీ ఆ బోర్డును అడ్డం పెట్టుకొని దాదాపు 9 లక్షల 50 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ప్రధాని మోదీ బిల్లు తేవడం ముస్లింకు వ్యతిరేకంగా కాదని, వారి నిజమైన భూములకు రక్షణ కల్పిస్తారని ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *