గడ్చిరోలీలో 8 గంటల పాటు ఎదురు కాల్పులు… నలుగురు నక్సలైట్లు హతం
మహారాష్ట్రలోని గడ్చిరౌలీలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య తీవ్ర ఎదురు కాల్పులు జరిగాయి. దాదాపు 8 గంటలకు పాటు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఇందులో ముగ్గురు మహిళా నక్సలైట్లు వున్నట్లు సమాచారం. మరోవైపు ఘటనా స్థలి నుంచి పోలీసులు భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
గడ్చిరోలీలోని కోపర్షి అటవీ ప్రాంతంలో భారీ స్థాయిలో నక్సలైట్లు వున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆపరేషన్స్ అదనపు ఎస్పీ రమేష్ నేతృత్వంలో సీఆర్పీఎఫ్ క్విక్ యాక్షన్ టీమ్స్ అడవిని చుట్టుముట్టాయి. ఈ అటవీ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. అయినా.. భద్రతా బలగాలు వర్షాలను లెక్క చేయకుండా అటవీ ప్రాంతానికి ఉదయమే చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలోనే భద్రతా బలగాలపై మావోయిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఆత్మ రక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.