నక్సల్స్ హింసను త్యజించాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు
బస్తర్ ప్రాంతంలోని నక్సలైట్ల హింసను వ్యతిరేకిస్తూ నక్సల్స్ బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ కేంద్రంగా నిరసనకు దిగారు. తమను నక్సల్స్ తీవ్రంగా హింసిస్తున్నారని, తమ జనాన్ని చంపేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు. 50 మంది వనవాసీలు ఈ నిరసనలో ఫ్లకార్డులతో పాల్గొన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. హింసామార్గాన్ని అనుసరించడం ఎంత మాత్రమూ సమర్థనీయంకాదన్నారు. వామపక్ష తీవ్రవాదులు హింసను త్యజించాలన్నారు.
అలాగే ప్రధాన స్రవంతిలో చేరాలని, వారు సూచించే సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతాయని పేర్కొన్నారు. భారత్ లో ప్రజాస్వామ్య మార్గం వుందని, ఇది గాంధీ చూపిన మార్గమని రాష్ట్రపతి తెలిపారు. హింసతో సతమతమవుతున్న ఈ ప్రపంచంలో మనం శాంతి మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. మరోవైపు కొన్ని సంవత్సరాలుగా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వనవాసీలు రాష్ట్రపతి ముందు వాపోయారు. వీరు చెప్పిన దాన్నంతా ముర్ము చాలా ఓపికగా విన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.