దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే జాతీయ విద్యా విధానం

అనేక సంవత్సరాల నుండి ఈ దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారం చూపడానికి వీలుగా భారత ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 తీసుకొని వచ్చింది.

2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఎస్సార్‌ ‌సుబ్రమణ్యం కమిటీని నియమించింది. 2019 మే లో కస్తూరి రంగన్‌ ‌కమిటీ నియమించింది. ఈ కమిటీ విస్తృతమైన అధ్యయనం చేసి, అనేకమంది విద్యావేత్తలతో సంప్రదింపులు జరిపిన తర్వాత తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ తుది నివేదిక తయారు చేయడానికి రెండు లక్షలకు పైగా సలహాలు భారతదేశంలోని వివిధ మేధావుల నుండి స్వీకరించింది.
కొత్తగా ప్రతిపాదించిన విధానంలో అనేక నూతన అంశాలను చేర్చారు. వాటిలో ముఖ్యమైన నిర్మాణాత్మకమైన మార్పులు: ప్రస్తుతం ఉన్న టెన్‌ ‌ప్లస్‌ ‌టు విధానం స్థానంలో 5+3+3+4 అనే కొత్త విధానం తెచ్చారు. నేడున్న ఇంటర్మీడియట్‌ ‌కళాశాలలు రాబోయే కాలంలో ఉండవు. వీటిని పాఠశాల విద్యలో కలిపేస్తారు. ఇప్పటి వరకు ఐదేళ్లు దాటిన విద్యార్థులకు మాత్రమే ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పిస్తున్నారు. కొత్త విధానంలో మూడేళ్ల పిల్లలకు నర్సరీలో ప్రవేశానికి అనుమతిస్తారు. తొమ్మిది నుండి 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ ‌విధానం వర్తిస్తుంది. డిగ్రీ విద్యార్థులు నాలుగేళ్లు చదవాలి. అయితే ఇందులో ఎప్పుడైనా చేరడానికి ఎప్పుడైనా మానేయడానికి అనుమతి లభిస్తుంది. మొదటి ఏడాది తర్వాత సర్టిఫికెట్‌ ‌కోర్సు, రెండో ఏడాదికి డిప్లొమా, మూడో ఏడాది వారికి బ్యాచులర్స్ ‌డిగ్రీ , నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి పరిశోధనతో కూడిన డిగ్రీ ప్రదానం చేస్తారు.
విద్యార్థులకు విషయాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. కఠినంగా ఉండే ఒక విషయాన్ని ఎంచుకున్న వాళ్లు సులభమైన ఇతర విషయాలు ఎంచుకునే అవకాశమూ ఉంది. సాంప్రదాయ విషయాలతో బాటు, భారతీయ కళలకు ప్రాముఖ్యత లభించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యాశాఖగా మార్చారు.
ఈ నూతన జాతీయ విద్యా విధానంలో విద్యార్థులు ఐదవ తరగతి వరకూ మాతృభాషలోనే చదువుకోవాలి. అలాగే అవసరాన్ని బట్టి ఎనిమిదవ తరగతి వరకు కొనసాగించే వెలసుబాటు ఇచ్చారు. ఉన్నత స్థాయిలో వైద్యశాస్త్రం , ఇంజనీరింగ్‌ ‌వంటివి కూడా తెలుగులో అధ్యయనం చేసేందుకు అవకాశం ఇచ్చే విషయం పరిశీలించనున్నారు.
విద్యార్థులు చదివే పాఠ్యాంశాలు కానీ,  వాళ్ళు ఆడే ఆటలు కానీ, నేర్చుకునే కళలు కానీ భారతీయత ఆధారంగా రానున్నాయి. ఇక్కడి విద్యార్థులు ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ వైభవ స్థితిని గురించి తెలుసుకొని, దానిపట్ల గర్వపడేలా తయారు చేయాలన్నదే ఈ విధాన పత్రం ముఖ్య లక్ష్యంగా తెలుస్తోంది. ఈ విషయాలు సరిగ్గా ప్రతిబింబించాలంటే పాఠ్యపుస్తకాల తయారీలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
పూర్వశిశు (నర్సరీ) విద్యార్థులకు క్రియాకలపాలతో కూడిన విద్యా విధానాన్ని కొనసాగిస్తారు. వీటిలో స్థానిక కథలు, పాటలు, కథల పద్యాలు, శ్లోకాలు, పజిల్స్ , ‌రిడిల్స్ ‌సంబంధించిన గేమ్స్ ఉం‌డనున్నాయి. ఇప్పటికీ మన దేశంలో ట్వింకిల్‌ ‌ట్వింకిల్‌ ‌లిటిల్‌ ‌స్టార్‌ , ‌రైన్‌ ‌రైన్‌ ‌గో అవే అనేవే నేర్పిస్తూ ఉన్నాం.  అభివృద్ధిపరిచే పక్రియ రానుంది. పూర్వ ప్రాథమిక తరగతుల్లో పిల్లలకు పై తరగతులకు కావలసిన సామర్థ్యం కల్పించేలా తయారు చేస్తారు.
ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదేళ్లు దాటిన తర్వాత మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. దీనితో పేద, దిగువ తరగతి తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలలో మూడేళ్లకు చేర్చలేకపోవడం ఆ చిన్నారులు చదువులో ముందడుగు వేయలేకపోతున్నారు. ఈ విధానంలో ఆ పిల్లలకు అవకాశం ఇవ్వడం వల్ల వారందరూ ప్రయోజనం పొందనున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివించగల ఆర్థిక స్తోమత ఉన్న పోషకులు అనేక సంవత్సరాలుగా నర్సరీ తరగతుల్లో వారి పిల్లలను చేర్పిస్తున్నారు. దీనితో సమాజంలో రెండు వర్గాలుగా విడిపోయిన తల్లితండ్రులు తమ పిల్లలచదువు విషయంలో భేదభావం అనుభవిస్తున్నారు. ఈ నూతన విద్యా విధానంతో అందరూ ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా ఈ వయసు పిల్లలు దాదాపు 85 శాతం మెదడు అభివృద్ధి చెందే దశలో ఉంటారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు అవకాశం ఇవ్వడం నిజంగా ఒక వరం.

 

 

– అయాచితుల లక్ష్మణరావు, విద్యాభారతి దక్షిణమధ్యక్షేత్ర కార్యదర్శి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *