పహల్గామ్ ఉగ్రదాడి : దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏ చేతికి అప్పజెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తు విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ ఉగ్రదాడి ఘటనను భారత భద్రతా బలగాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. కేంద్ర హోంశాఖ తాజా నిర్ణయంతో ఈ దర్యాప్తు ఎన్ఐఏ చేతిలోకి వెళ్లిపోయింది. కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయాన్ని వెలువరించడమే ఆలస్యం… వెంటనే ఎన్ఐఏ రంగంలోకి దిగింది, దర్యాప్తును ప్రారంభించేసింది.
శనివారం రాత్రి వరకూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంటనే కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ రాడికలైజేషన్ (CTCR) విభాగం నుంచి ఎన్ఐఏ ఉత్తర్వులు అందుకుంది. వెంటనే FIR కూడా నమోదు చేసేసింది. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను పోలీసులు, ఇతర అధికారుల సమక్షంలో ఎన్ఐఏ విచారణ చేస్తోంది. ఫొటోలు, వీడియోలను పరిశీలిస్తోంది. పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని కూడా ఎన్ఐఏ కోరింది. పాక్ ప్రేరేపిత లష్కరే తోయ్యబా తో సంబంధమున్న రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. దీంతో ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించడం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.