మన్ కీ బాత్ లో నుర్వి రాజశేఖర్… ప్రకృతికి ఆయన చేస్తున్న సేవ ఏమిటంటే

ప్రధాని నరేంద్ర మోదీ తన 114 మన్ కీ బాత్ పలు ఆకర్షణీయ విషయాలు మాట్లాడారు. అయితే… మొక్కలు నాటే విషయంలో ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యక్తి పేరును తీసుకొని, చాలా మెచ్చుకున్నారు. ఆయన పేరు నుర్వి రాజశేఖర్, స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన కొత్తూరు గ్రామం. ఈయన మొక్కలు నాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించి, మెచ్చుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంతో పాటు యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలను కూడా మోదీ ప్రశంసించారు. ఏక్ పేడ్ కే నామ్ పేరిట కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, లక్ష్యానికి మించి మొక్కలను ఈ రాష్ట్రాలు నాటి, రికార్డు నెలకొల్పాయని హర్షం వ్యక్తం చేశారు.

ఇంతకి ఎవరీ రాజశేఖర్ అంటే….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన కొత్తూరు నుర్వి రాజశేఖర్ సింగరేణి కాలరీస్ లోని సెంట్రల్ వర్క్ షాపులో పనిచేస్తున్నారు. ఈయనకు ప్రకృతి, మొక్కలంటే మహా జాస్తి. ఈ మమకారంతో 2016 నుంచి స్వచ్ఛందంగా పర్యావరణ పరిరక్షణ చేస్తున్నారు. జూలై 1,2020 నుంచి ప్రతి రోజూ కనీసం ఒక్క మొక్కనైనా తప్పకుండా నాటాలని సంకల్పంతో ‘‘ప్రకృతి హరిత దీక్ష’’ ను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు… ఇలా తెలిసిన వారి పుట్టిన రోజులకు గానీ, పెళ్లి రోజులకు గానీ… ఇతరత్రా శుభ కార్యక్రమాల సందర్భంగా ఓ మొక్కను నాటుతారు. ఇలా ప్రతిరోజూ మొక్కలు నాటుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సందర్భంగా వారికి ఓ మొక్కలను బహూకరిస్తారు.

కోటి విత్తనాలు పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ఇప్పటి వరకూ నుర్వి రాజశేఖర్ 10 లక్షలకు పైగా విత్తనాలను పంపిణీ చేశారు. ఇందులో ఎక్కువగా వనవాసీ ప్రాంతాల్లోనే పంచారు. తన బైక్ లో ఎప్పుడూ మొక్కలను తీసుకెళ్తుంటారు. మొక్కలను పంచడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యాన్ని కూడా వివరిస్తుంటారు. ప్రకృతి కోసం వీరు చేస్తున్న సేవకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రశంసలను కూడా అందుకున్నారు. తాజాగా సాక్షాత్తూ ప్రధాని మోదీయే వీరి కృషిని గుర్తించి, మన్ కీ బాత్ లో మెచ్చుకున్నారు.

క్లిష్ట సమయంలోనూ ఈ మొక్కల పంపిణీ చేయడం ఆయన ఆపలేదు. మూడు నెలల క్రితం ఈయన ద్విచక్రవాహనంపై పడి, గాయాల పాలయ్యారు. ఆ క్లిష్ట సమయంలోనూ పట్టు వదలకుండా మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచారు. కోటి విత్తనాలు చల్లడమే తన లక్ష్యమని, ఇప్పటి వరకు 10 లక్షలకు రీచ్ అయ్యానని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారంటే…

అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తెలంగాణకు చెందిన రాజశేఖర్ ఎంతో చిత్తశుద్ధితో మొక్కలు నాటుతున్నారు. ఆయన చూపుతున్న నిబద్ధత ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆయన రోజూ కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని సంకల్పించారు. ఇలా ఇప్పటి వరకూ 1500 కి పైగా మొక్కలు నాటారు. ప్రమాదం బారినపడినా… తన సంకల్పాన్ని వీడలేదు. ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అని మోదీ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *